ఏపీ సీఎంగా జగన్ తీసుకునే నిర్ణయాలు ఒకపట్టాన రాజకీయ మేధావులకు సైతం అంతు పట్టడం లేదు.జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, అది సంచలనంగానే మారడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
జగన్ నిర్ణయాలు వివాదాస్పదంగా కనిపించినా, కొన్ని కొన్ని ఫలితాలను సాధించాయి.తాను ఐదేళ్ల ముఖ్యమంత్రిని కాదని, 30 ఏళ్ల ముఖ్యమంత్రి అంటూ జగన్ పదేపదే చెప్పుకుంటున్నారు.
దానికి తగ్గట్టుగానే రాజకీయంగాను ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రతిపక్షాలకు తమపై విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా జగన్ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇక అన్ని వ్యవస్థల్లోనూ టిడిపి అధినేత చంద్రబాబు మనుషులు ఉన్నారు అని మొదటి నుంచి జగన్ అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.దానికి తగ్గట్టుగానే అన్ని శాఖల్లోనూ ప్రక్షాళన చేస్తూ, చంద్రబాబు మనుషులుగా ముద్రపడిన అధికారులందరినీ కీలక పదవి నుంచి తప్పించి ప్రాధాన్యం లేని పోస్టుల్లో కూర్చోపెట్టారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ పై అనేక ఆరోపణలు చేస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జగన్ లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అనవసరంగా జగన్ రాజ్యాంగ వ్యవస్థల జోలికి వెళ్తున్నారని, ఆయన ముందు ముందు అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని జగన్ కు సూచనలు అందినా ఏమాత్రం లెక్కచేయకుండా, ముందడుగు వేశారు.జస్టిస్ రమణ కు చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలున్నాయని , కొన్ని ఆధారాలతో సహా జగన్ లేఖ రాయడంతో ఈ లేఖ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. జగన్ పై కోర్టు ధిక్కారం నేరం కింద కేసు పెట్టే అవకాశం ఉంది.
అదే జరిగితే జగన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాగే అరెస్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అనే సూచనలు అందుతున్నాయి.
ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మొదలైంది.
ఏడాదిలోగా ఈ కేసులను ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు అందడంతో, శరవేగంగా కోర్టుల్లో విచారణ జరుగుతుంది.
ఈ వ్యవహారంలో జగన్ నిర్దోషిగా బయటికి వస్తారు అంటూ వైసీపీ నాయకులు పదేపదే చెబుతున్నారు.కానీ పొరపాటునో గ్రహపాటునో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, జగన్ తన పదవిని కోల్పోతారు.
అవినీతి ముద్ర వేయించుకుంటారు.ఇది ముందుగానే గ్రహించిన జగన్ అన్ని వ్యవస్థల్లోనూ బాబు మనుషులు ఉన్నట్లుగానే, న్యాయ వ్యవస్థలోనూ ఆయన మనుషులు ఉన్నారని, తనను కావాలనే ఈ విధంగా అరెస్టు చేయించారని చెప్పుకునేందుకు, జగన్ కు అవకాశం ఉంటుంది.
అందుకే రిస్క్ అని తెలిసినా జగన్ మాత్రం డేరింగ్ స్టెప్ వేసినట్టు గా కనిపిస్తున్నారు.