తేడా వస్తే, తన మన అనే బేధం లేకుండా, ఎవరిపైనా వేటు వేసే విషయంలో ఎటువంటి మొహమాటం పడరు వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్.ఇది అనేక సందర్భాల్లో రుజువైంది.
ఇక తన పరిపాలనలో ఎక్కడా, అవినీతి, అక్రమాలకు తావు ఉండకూడదు అనే విధంగానే జగన్ ముందు నుంచి జాగ్రత్త పడుతూ వస్తున్నారు.అలాగే కుల ముద్రలను సైతం తప్పించుకునేందుకు మంత్రిమండలిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించి, తన సొంత సామాజిక వర్గాన్ని కూడా జగన్ పక్కన పెట్టారు.
ఇక వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని, తమ రాజకీయ భవిష్యత్తు కు ఎటువంటి ఢోకా ఉండదని జగన్ అంచనా వేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ, ఏపీలో అవినీతి రహిత పాలన సాగుతోందనే సంకేతాలు దేశవ్యాప్తంగా ఇవ్వాలని జగన్ చూస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, జగన్ ఆశయాలను ఇప్పుడు సొంత పార్టీ మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉండడంతో జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.అవినీతి వ్యవహారాలపైన ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు, ప్రైవేటు సర్వే ద్వారా సమగ్ర వివరాలు రాబట్టడంతో జగన్ త్వరలోనే అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతున్న కొంతమంది మంత్రులను తప్పించి క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని చూస్తున్నారట.
ఇప్పటికే అటువంటి వారికి జాగ్రత్తగా ఉండాలి అంటూ పరోక్షంగా వార్నింగ్ లు ఇచ్చినా, వారిలో మార్పు కనిపించకపోవడంతో ఇక అవినీతి వ్యవహారాలు మునిగితేలుతున్న మంత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలకు సైతం సీరియస్ గానే పార్టీ అధిష్టానం నుంచి వార్నింగ్ లు వెళ్లాయట.
ప్రస్తుతం వైసీపీలో ఈ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది.