ఒకవైపు కరోనా వైరస్, మరోవైపు పార్టీ నాయకుల సెగ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చుట్టుముడుతున్నాయి.పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఫైనల్ నిర్ణయం తనదే ఉండేలా చేసుకున్న జగన్ ఇప్పుడు పార్టీ నాయకులు బహిరంగంగా జగన్ తీరు విమర్శించే స్థాయి కి వచ్చేయడంతో పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
అసలు పార్టీ శ్రేణులు జగన్ పై ఈ స్థాయిలో ఆగ్రహం గా ఉండడానికి కారణం వలసలేనని తెలుస్తోంది.వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొంది.
గత టిడిపి ప్రభుత్వంలో వైసీపీ నాయకుల పై ఎన్నో కేసులు నమోదైన ఎవరూ వెనక్కి తగ్గకుండా తెలుగుదేశంపై రాజీలేని పోరాటం చేశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి నాయకులు, అప్పటి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జి ల కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి భారీ ఎత్తున నాయకులు పార్టీలో చేరేందుకు సిద్ధమైన, జగన్ మాత్రం వారిని చేర్చుకునే విషయంలో అంత ఆసక్తి చూపించలేదు.
ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే గ్రూపు తగాదాలు ఏర్పడతాయనే ఉద్దేశంతో టిడిపికి చెందిన కీలక నాయకులు వస్తామన్న గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టారు.అయితే క్రమక్రమంగా తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అనే సంకేతాలు రావడంతో జగన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికలు ముందు వరకు వైసీపీలో చేరికలు ఎక్కువగా జరిగాయి.
అయితే పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొంతమంది టిడిపి నేతలను చేసుకునే విషయంలో జగన్ వెయిటింగ్ లో పెట్టారు.ఈ కరోనా వ్యవహారం ముగిసిన తరువాత పార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్న టిడిపి నేతలను వైసీపీలో చేర్చుకోవాలని జగన్ ఆలోచిస్తూ ఉండటం ఇప్పుడు వైసీపీ లో తీవ్ర చర్చకు కారణమవుతోంది.
ముఖ్యంగా జగన్ నిర్ణయం పై రాయలసీమ నాయకుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి .కర్నూలు జిల్లా పత్తికొండలో కేఈ కుటుంబ హవా ను కూడా తట్టుకుని చెరుకువాడ నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.అయితే ఇప్పుడు కేఈ ప్రభాకర్ వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికి జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో శ్రీదేవి తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తన భర్తను చంపించిన కే ఈ కుటుంబం అని మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్న శ్రీదేవి కేఈ ఫ్యామిలీ వైసీపీ లోకి వస్తే ఏ నిర్ణయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.ఇక అనంతపురం జిల్లాలోనూ ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఇక చిత్తూరు జిల్లాలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబం వైసీపీలో చేరాలని చూస్తోంది.అయితే వారి చేరికను నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఇక జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల లోనూ ఇదే పరిస్థితి.కొన్ని దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి బద్ద వ్యతిరేకిగా, ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వస్తున్న సతీష్ రెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
అసలు జగన్ తాత రాజారెడ్డి హత్య కేసులోనూ సతీష్ రెడ్డి కుటుంబం పై ఆరోపణలు ఉన్నాయి.అటువంటి వ్యక్తిని జగన్ చేర్చుకునే అవకాశం ఉందన్న ప్రచారం పులివెందులలో జరుగుతోంది.
జగన్ తీరుపై పార్టీ శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీ లో చేరే నాయకుల విషయంలో ఇదే రకమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్న ట్లు తెలుస్తోంది.
అయితే జగన్ ఈ విషయాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది తేలాల్సి ఉంది.