జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.ఎన్నో వేధింపులను తట్టుకున్నారు.
చివరకు జైలు జీవితం గడిపారు.ఏపీ మొత్తం తన పాదయాత్ర ద్వారా తిరిగి ప్రజల్లో బలం పెంచుకున్నారు.అది ఎంతగా అంటే 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లు సాధించే అంత.40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న , రాజకీయ ఉద్దండుడు అయిన చంద్రబాబు ను దెబ్బతీసే అంతగా. టీడీపీకి 23 స్థానాలు మాత్రమే మిగిల్చారు.ఇక అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజా సంక్షేమ పథకాలతో జనాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ జగన్ దూసుకుపోతున్నారు.
అయితే జగన్ కు ఏ స్థాయిలో క్రెడిట్ వచ్చిందో అంతే స్థాయిలో విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా ఆయన అధికారంలో కి వచ్చిన తరువాత ఏర్పడిన ఇబ్బందులు జగన్ పరిపాలన పై అందరిలోనూ అనుమానాలు కలిగేలా చేశాయి.
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది.అయితే దానికి అవసరమైన సొమ్ము కోసం ప్రతిసారి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
దీనికి తోడు కరోనా ప్రభావంతో గత ఏడాది , ఇప్పుడు ఆర్థికంగా ఏపీ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది.ఆ లోటును భర్తీ చేసుకోవడం ఇప్పట్లో కుదరని పని.దీనికితోడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏపీ విషయంలో పెద్దగా సానుకూలంగా లేకపోవడం జగన్ కు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.ఇక అదేపనిగా టిడిపి, ఆ పార్టీ అనుకూల మీడియా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న, వాటిని తిప్పికొట్ట లేని పరిస్థితుల్లో వైసిపి ఉండిపోతుంది.
ప్రస్తుత మంత్రులలో చాలామంది కొత్తవారు ఉండడంతో, టిడిపి విమర్శలను వారు తిప్పికొట్టలేకపోతున్నారు.దీనికి తోడు పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, కరోనా ప్రభావంతో ప్రజలకు ఆదాయం బాగా తగ్గడం, వ్యాక్సిన్ కొరత ఇలా ఎన్నో అంశాలు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నాయి.
ఇక తమ రాజకీయ ప్రత్యర్ధుల ను టార్గెట్ చేసుకుని వారిపై ఉన్న వివిధ కేసులను బయటకు తీసి వారిని అరెస్టు చేసి జైలుకు వెళ్లేలా చేస్తున్నా, ఆ కేసుల్లో వారు వెంటనే బయటకి వచ్చేస్తూ ఉండడం, ఆయా కేసుల్లో వైసీపీ ప్రభుత్వం కు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతుండడం, ఇలా ఎన్నో కారణాలతో వైసీపీ కి ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.పార్టీలోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోతుండడంతో జగన్ లోనూ అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది.దీంతో ఏపీలో ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితుల ప్రభావం మొత్తం జగన్ మెడకు చుట్టుకుంటూ అనుకున్న స్థాయిలో రాజకీయ మైలేజ్ పొందలేకపోతున్నారు.