ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ఎక్కడా ప్రభుత్వానికి కానీ, పార్టీకి గానీ, చెడ్డపేరు రాకుండా చూసుకుంటూ ఉంటారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.మొన్నటి వరకు ప్రతి పక్షాలకు సైతం జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసే అవకాశం దక్కలేదు.కానీ కొద్దిరోజులుగా అదేపనిగా ప్రభుత్వం వివాదాల్లో చిక్కుకుంది.రోజుకో సంఘటన జగన్ కు ఇబ్బందికరంగా మారింది.ముఖ్యంగా కొంత మంది ఎమ్మెల్యేలు అవినీతి వ్యవహారాలకు, బెదిరింపులకు పాల్పడుతుండడం వంటి సంఘటనలతో కాస్త అప్రమత్తమై వారిని దారిలో పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.ఇదిలా ఉంటే ఏపీలో వరుసగా హిందూ ఆలయాలలో చోటుచేసుకుంటున్న సంఘటనలు జగన్ కు ఇబ్బందికరంగా మారాయి.
అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం అవ్వడం, ఆ తర్వాత విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన వెండి రధానికి ఉండే సింహాలు మాయమవడం, మరికొన్ని చోట్ల విగ్రహాల ధ్వంసం, ఇలా ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.వీటన్నిటితో బీజేపీ, టిడిపి, జనసేన పార్టీ లు అదే పనిగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి.ముఖ్యంగా బీజేపీ ఈ వ్యవహారంలో జగన్ ను బాగా ఇబ్బంది పెడుతోంది.కేంద్రానికి సైతం జగన్ ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తూ, ఆయన హిందూ వ్యతిరేక శక్తి అనే ముద్రను వేస్తూ వస్తున్నారు.
దీని కారణంగా జగన్ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇక ఛలో అమలాపురం అంటూ బీజేపీ నేతలు ఏపీ లో నిన్న చేసిన హడావుడి జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది.ఈ విధంగా ఒక పథకం ప్రకారం తనను బీజేపీ టార్గెట్ చేసుకుంటున్నట్టుగా జగన్ గ్రహించడంతో, బీజేపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జగన్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా హిందూ దేవాలయాలకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, ఎక్కడా మతపరమైన విమర్శలు చేయవద్దని సూచించారట.
ముఖ్యంగా నియోజకవర్గాలోని బీజేపీ నాయకుల కదలికలపై దృష్టి పెట్టడంతో పాటు, వారు విమర్శలు చేసేందుకు అవకాశం లేకుండా, వారిని అన్ని రకాలుగా కట్టడి చేయాలని, వారి బలహీనతలను తెలుసుకోవాలని ఎమ్మెల్యేలకు సమాచారం పంపినట్లు తెలుస్తోంది.ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సంఘటన చోటు చేసుకున్నా,లేక వైసిపి నాయకులు ఎక్కడైనా నోరుజారి మతపరమైన వ్యాఖ్యలు చేసినా, బీజేపీ కేంద్ర పెద్దల ఆగ్రహానికి గురి కావడంతో పాటు, అనవసర వివాదాలు తలకెత్తుకోవాల్సి వస్తుందనే అభిప్రాయంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.