ఏపీముఖ్యమంత్రి హోదాలో మొదటి సారి కేంద్రంలో నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కీలకంగా ప్రస్తావించారు.ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి గుర్తు చేసారు.
విభజన సమయంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఏపీ ఆదాయం మొత్తం హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం ఉందని, అలాంటిది విభజన సమయంలో 59 శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయం ఇచ్చారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం కావడం వలన వచ్చే ఆదాయం ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ని తీర్చడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిందని, అయితే అప్పటి అధికార, విపక్ష పార్టీలు హామీని నిలబెట్టుకోలేదని, ఈ కారణంగా రాష్ట్రం వడ్డీల భారంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని జగన్ చెప్పుకొచ్చారు.
ఇక ఏపీకి ప్రతేక హోదా మాత్రమే సంజీవని అని, దాంతో రాష్ట్రానికి జరిగిన నష్టం కొంతలో కొంత పూరించినట్లు అవుతుందని జగన్ చెప్పారు.
ఈ ప్రత్యేక హోదా కారణంగా పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు, ఇతర మినహాయింపులతో పాటు, ఉద్యోగాల కల్పన పెరుగుతుందని, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పారు.అలాగే బీజేపీ పార్టీ అన్నట్లు 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదాకి వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదని, ఆ కమిటీ సభ్యుడు రాసిన లేఖని కూడా ప్రస్తావించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలని క్యాబినెట్ ప్లానింగ్ కమిషన్ కూడా సిఫార్సు చేసిందని గుర్తు చేసారు.ఇక ప్రత్యేక హోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడతాయి అనేదానిలో వాస్తవం లేదని, రాష్ట్ర విభజన జరిగే సమయంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చినపుడు అన్ని పార్టీలు అక్కడే ఉన్నాయని ఎవరు అప్పుడు అభ్యంతరం చెప్పలేదని, అలాగే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో లో కూడా పెట్టిందని ముఖ్యమంత్రి జగన్ అధికార పార్టీకి గుర్తు చేసారు.
మరి జగన్ స్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెప్పిన విషయం మీద మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది వేచి చూడాలి.