మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా చెప్పుకుని వైసీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ అందుకోసం గట్టిగానే కష్టపడ్డాడు.
ఎన్నికల్లో గెలిచేందుకు కూడా అనేక భారీ హామీలు ఇచ్చాడు.అసలు ఆ హామీలు అమలు చేయడం సాధ్యమయ్యే పనేనా అని అంతా అప్పట్లో ముక్కున వేలేసుకున్నారు.
కానీ జగన్ మాత్రం వాటన్నిటిని అమలుచేస్తానని మొండిగా చెప్పాడు.అన్నట్టుగానే ఇప్పుడు వాటన్నిటిని అమలు చేసే పనిలో బిజీ అయ్యాడు జగన్.
అధికారం చేపట్టి వారం రోజులు గడవకముందే ఆయన తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
మరీ ముఖ్యంగా చెప్పుకుంటే ఎన్నికల హామీలో ప్రధానమైన ‘నవరత్నాలు’ అమలుచేయడం కోసం జగన్ చాలా పగడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు.అయితే ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో, ఆర్థిక కష్టాల్లో ఉంది.ఈ దశలో ఆయన మద్య నిషేదంపై కఠినంగా వ్యవహరిస్తుండటం ఆయన వైఖరికి అద్దం పడుతోంది.ఎన్నికలకు ముందు నుంచే వైసీపీ అధికారంలోకి వస్తే దశలవారీగా మద్య నిషేదం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.అయితే, రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం మద్యం నుంచే వస్తోంది.
సుమారు 17 వేల కోట్ల వార్షిక ఆదాయం దీనిద్వారానే లభిస్తోంది.ఇప్పుడు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంత ఆదాయాన్ని వదులుకోవడం నిజంగా సాహసమే అని చెప్పాలి.
తాను ఇచ్చిన హామీ మేరకు అన్ని వాగ్ధానాలను అమలు చేయాలనే దృఢ నిశ్చయంతో జగన్ ఉన్నారు.అందుకే ముందుగా చెప్పినట్టుగానే దశలవారీగా మద్య నిషేదం అమలు చేస్తున్నారు.ఇప్పటికే ఆయన గ్రామాల్లో ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేస్తున్న బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలని అధికారులకు సూచించారు.ఎక్సయిజ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులకు కూడా ఈ విషయంలో కొన్ని అధికారాలు కల్పించి కఠినంగా వ్యవహరిస్తున్నాడు.
క్రమక్రమంగా మద్యం దుకాణాల సంఖ్యను కూడా తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు.అలాగే ఆశా వర్కర్లకు జీతాలు రూ.3 వేల నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇది కూడా సాహోసోపేత నిర్ణయంగానే చెప్పాలి.నిత్యం వివిధ శాఖ అధికారులతో సమీక్షలు చేస్తూ ఆయా శాఖలను మరింత పటిష్ఠపరిచి పారదర్శకంగా వ్యవహరించేలా చూడాలని జగన్ ఆదేశాలు జారీ చేస్తున్నాడు.