ఒకపక్క తెలంగాణలో కరోన పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండగా ఏపీలో మాత్రం రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతూ వస్తోంది.మొదటి నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కఠిన నిబంధనలు అమలు చేస్తూ కరోనా ను అతి తొందర్లోనే కట్టడి చేస్తామనే ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు.అనుకున్నట్లుగానే తెలంగాణలో పరిస్థితి కాస్త అదుపులోకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది.తరచుగా కెసిఆర్ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు, అధికారులకు ధైర్యం చెబుతూ వస్తున్నారు.అయితే ఇదే విషయంలో ఏపీ సీఎం జగన్ అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు.మొదటి నుంచి కరోనా విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తరచుగా వస్తూనే ఉన్నాయి.
ఎప్పటికప్పుడు ఏపీ లో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను ఆయన కప్పి పెడుతూ వస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.అలాగే కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ప్రభుత్వ లెక్కల్లో మాత్రం తక్కువగా చూపిస్తూ వస్తున్నారనే నిందలు జగన్ పై పడ్డాయి.
అయితే ఏ విషయంలోనూ జగన్ పెద్దగా స్పందించలేదు.
ఇక మీడియా సమావేశాలు నిర్వహించే విషయంలో జగన్ మొదటి నుంచి దూరంగానే ఉంటున్నారు.
ఏదైనా ప్రజలకు సందేశం ఇవ్వాల్సి వచ్చిన సమయంలో ప్రత్యేకంగా ఒక వీడియో రికార్డ్ చేసి దానిని మాత్రమే మీడియాకు విడుదల చేస్తూ వస్తున్నారు.తాజాగా నిన్న సాయంత్రం జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తారని ఉదయం నుంచి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరిగింది .అన్నట్టుగానే జగన్ మాట్లాడిన మాటలు మీడియాలో వచ్చాయి.అయితే ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
కరోనా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, అది ఒక సాధారణ జ్వరం మాత్రమే అంటూ మాట్లాడారు.
జగన్ ముందు నుంచి ఇదే విధంగా మాట్లాడుతూనే వస్తున్నారు.అయితే తాజాగా జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ రికార్డు చేసిందనే ఆరోపణలకు కొన్ని కొన్ని సాక్ష్యం గా కనిపిస్తున్నాయి.జగన్ నిన్న సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించిన మీడియా సమావేశం అంటూ చేసిన హడావుడి పైన, అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి .మీడియా సమావేశం జగన్ మాట్లాడుతున్న సందర్భంలో జగన్ వాచీలో సమయం 1:00 గా కనిపించింది .దీంతో ఇది రికార్డ్ చేసిన వీడియో ని మీడియా సమావేశం గా చూపించారని, జగన్ మీడియా తో మాట్లాడలేదని, ఒకవేళ మీడియా నిర్వహించినా మీడియా అడిగిన ప్రశ్నలకు జగన్ వద్ద సరైన సమాధానం లేదనే భయంతోనే ఈ విధంగా వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి.అదే విధంగా మొదటి నుంచి జగన్ వైఖరి అనేక సందేహాలకు తావిస్తూ వస్తోంది.