ఒకవైపు ఏపీలో జనసేన పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బలం లేదని, ఈ విషయం గత ఎన్నికల్లోనే అర్థం అయిందని వైసీపీ పదేపదే వాదిస్తోంది.స్వయంగా ఆ పార్టీ అధినేత పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఘోర ఓటమి చవి చూశారు.
భవిష్యత్తులో ఇక ఆ పార్టీ పుంజుకోవడం జరగదని, ఆ భయంతోనే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని, ఆ తరువాత క్రమంగా జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తారని ఇలా అనేక రకాలుగా వైసీపీ వాదనలు తెరపైకి తీసుకు వస్తోంది.అసలు తాము జనసేన పార్టీని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కానీ పరిగణలోకి తీసుకోవడం లేదని, పదే పదే వైసీపీ వాదిస్తోంది.
కానీ జనసేన పార్టీని వైసీపీ లెక్కలోకి తీసుకోవడం లేనట్టుగా వ్యవహరిస్తున్నా, ఆ పార్టీ అంటే బాగా భయపడుతున్నట్లు గా కనిపిస్తోంది.దీనికి కారణం లేకపోలేదు.ప్రస్తుతం టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.ఆ పార్టీ పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన, ఆ పార్టీ శ్రేణుల్లోనూ నమ్మకం లేదు.
ఇక చంద్రబాబు వయసు రీత్యా త్వరలో రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉండడంతో పాటు, చంద్రబాబు తర్వాత టీడీపీ రాజకీయ వారసుడు ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.లోకేష్ బాబు వారసుడిగా ఉన్నా, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అందుకే టీడీపీతో తమకు పెద్ద ఇబ్బంది ఉండదు అన్నట్లుగా వైసీపీ ఒక అంచనాకు వచ్చేసింది.
ఇక తమకు ముప్పు అంతా పవన్ తోనే ఉంటుందని వైసీపీ భావిస్తోంది.దీనికి కారణం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఏపీలో ఎక్కువగా ఉండటం, ఆ సామాజిక వర్గం వారు అంతా పవన్ ను బాగా ఆరాధిస్తూ ఉండడం, దీనికితోడు సినీ అభిమానులు ఎప్పుడు పవన్ కు అండగా ఉండడం, అది కాకుండా ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడలు కూడా పవన్ కు అదనపు బలంగా మారతాయని, రాబోయే రోజుల్లో తమ ప్రధాన శత్రువు పవన్ అవుతారని వైసీపీ బలంగా నమ్ముతోంది.అందుకే ఇప్పుడు పవన్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆయనను టార్గెట్ చేసుకోవాలని వైసీపీ నాయకులు ఆలోచిస్తున్నారు.
అందుకే ఇప్పుడు ఆయనపై పూర్తిగా ఫోకస్ పెంచాలని వైసీపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.