రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి సమస్యలు పెద్దగా లేకపోయినా, జల వివాదాలు మాత్రం కొనసాగుతున్నాయి.ఈ వివాదాలు లేకపోతే ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత సన్నిహితంగా మెలిగేవారు.
కృష్ణా జలాల విషయంలో పైకి రెండు రాష్ట్రాల మంత్రులు, నాయకులు విమర్శలు చేసుకుంటున్నా, జగన్ ను కేసీఆర్ తిట్టిపోస్తున్నా, జగన్ మాత్రం నోరు మెదపడం లేదు.సైలెంట్ గానే ఉంటున్నారు.
ఈ వ్యవహారాలు ఇలా ఉంటే, రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు.జనాల్లోకి వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు.
దీనిపై రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా, కెసిఆర్ ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా, ఆయన మాత్రం లెక్క చేసేవారు కాదు.
ఇక జనాల్లోకి వెళ్లిన ఘటనలు చాలా అరుదుగానే ఉన్నాయి.
అయితే గత కొద్ది రోజులుగా కేసీఆర్ వైకిరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.ఆయన తీరిక లేకుండా నిత్యం ఏదో ఒక జిల్లాలో పర్యటిస్తూ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అంటూ హడావుడి చేస్తూనే ఉన్నారు.
కరోనా సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో గాంధీ ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించడం వంటి సాహసోపేతమైన వ్యవహారాలు చేశారు.ఇక ఏపీ సీఎం జగన్ విషయానికొస్తే పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు, దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా, జగన్ మాత్రం జనాల్లోకి రావడం మానేశారు.
వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పాదయాత్ర అంటూ ఎప్పుడు జనం మధ్యనే ఉంటూ వచ్చిన జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన క్యాంపు కార్యాలయానికి పరిమితమైపోతున్నారు.దీంతో జగన్ పై విమర్శలు రావడంతో పాటు, సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది.అయినా జగన్ సైలెంట్ గానే ఉంటున్నారు.అయితే ఈ వ్యవహారాల కారణంగా పార్టీ కి డ్యామేజ్ జరుగుతోందని గ్రహించిన జగన్ దానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగానే ఇప్పుడు జనాల్లోకి వెళ్లి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, వివిధ అభివృద్ధి పనులపై సమీక్షలు చేయడంతోపాటు, నేరుగా ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.దీంతో జగన్, కెసిఆర్ బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.