ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకునపెట్టుకుంటూ ముందుకు వెళ్లకపోతే రాజకీయాల్లో విజయవంతంగా ముందుకు వెళ్లడం సాధ్యం కాదు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతూ కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అనేక విషయాల్లో ప్రజా పోరాటాలు చేస్తోంది.
ముఖ్యంగా ఇసుక దీక్ష పేరుతో వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఇందులో కొంచెం సక్సెస్ అయినట్టుగానే కనిపించింది.
నిస్తేజంలో ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఒకరకమైన ఉత్సాహాన్నితీసుకొచ్చింది.ఈ పరిస్థితుల్లో వైసీపీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటూ విమర్శలపాలవుతోంది.
ఈ పరిస్థితి నుంచి ప్రతిపక్షలను డైవర్ట్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది.ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ ను కూడా వ్యక్తిగత విమర్శలు చేసి కొంతమేర డైవర్ట్ చేయగలిగారు.
ఇప్పుడు టీడీపీ విషయంలోనూ అదే రకమైన డైవర్షన్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.
ఆ వ్యూహంలో భాగంగానే తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి వైసీపీ లో చేర్చుకున్నారు.అది కూడా చంద్రబాబు దీక్ష చేసిన రోజునే ప్లాన్ చేసుకున్నారు.అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతానని స్పష్టమైన ప్రకటన చేశారు.
చంద్రబాబు పన్నెండు గంటల దీక్ష చేస్తున్న సమయంలోనే ఈ ప్రధాన సంఘటనలు జరగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఇద్దరు నాయకులు ఒకే సామాజికవర్గాని చెందినవారే కాకుండా బలమైన నాయకులుగా పేరుపొందినవారు.
ఆర్థికంగా, ఓటు బ్యాంకు పరంగా బలమైన లీడర్లుగా ఉన్నారు.చంద్రబాబు దీక్షకు దిగిన సమయంలోనే ఈ రెండు సంఘటనలు ఎందుకు జరిగాయన్నది టీడీపీ నేతలకు అంతుపట్టడంలేదు.
చంద్రబాబును మానసికంగా దెబ్బతీసి తెలుగుదేశం పుంజుకోకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా పార్టీని దెబ్బతీసేందుకు వైసీపీ ప్లాన్ చేసుకుంటోంది అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.వాస్తవానికి వల్లభనేని వంశీ రాజీనామా చేసిన నెల రోజులు పైనే అయ్యింది.అకస్మాత్తుగా చంద్రబాబు దీక్ష రోజునే ఆయన బయటకు వచ్చి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.దేవినేని అవినాష్ చేరిక విషయాన్ని పెండింగ్ లో ఉంచిన వైసీపీ అధినాయకత్వం బాబు దీక్షరోజునే చేరికకు అనుమతివ్వడం ఇవన్నీ వైసీపీ సమర్థవంతంగా ప్లాన్ చేసుకుని దెబ్బకొట్టినట్టుగా కనిపిస్తోంది.
ముందు ముందు కూడా ఇదే రకమైన రాజకీయ వ్యూహాలను అమలుచేయాలని చూస్తోంది.
.