జాతీయ పార్టీ గానే కాకుండా, కేంద్ర అధికార పార్టీ గా బీజేపీ విధానాలు ఏంటో ఎవరికి స్పష్టంగా అర్థం కావడం లేదు.ముఖ్యంగా చాలా నిర్ణయాలు, అభిప్రాయాలలో పార్టీ జాతీయ నాయకుల విధానం , రాష్ట్ర నాయకుల విధానం ఒకేలా ఉండకపోవడంతో ఆ పార్టీకి ఒక స్పష్టమైన విధానం కానీ, క్రమశిక్షణ కానీ లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఏపీ సీఎం జగన్ విషయంలోనే చూసుకుంటే, కేంద్ర బిజెపి నాయకులు ఒక విధంగా ఉంటే ఏపీ తెలంగాణ నాయకులు ఒకవిధంగా జగన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి ఇటీవల కరోనా విషయం పై స్పందిస్తూ ఏపీలో జగన్ కరోనా కట్టడి విషయంలో బాగా పనిచేస్తున్నారని, ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే జగన్ పనితీరు బాగుందని, జగన్ ముందుచూపుతో ఏపీలో లాక్ నిబంధనలలో కొన్ని సడలింపు ఇచ్చారనీ, ఇది మంచి పరిణామం అంటూ ఆయన పొగడ్తల వర్షం కురిపించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ నిబంధనలు మరికొంతకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు అని ఆయన విమర్శించారు.ప్రజలకు జీవితం కూడా ముఖ్యమనే విషయం కేసీఆర్ పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు.
ఇదే రకమైన అభిప్రాయం గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా వ్యక్తం చేశారు.
ఏపీ బీజేపీ నేతలు మాత్రం జగన్ తీరును తప్పు పడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ విధానాలను పొగుడుతున్నారు. కరోనా విపత్తు సమయంలో ఎంతో ధైర్యంగా సమర్థవంతంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, లాక్ డౌన్ పొడిగించి కరోనా ను కట్టడి చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో కేసీఆర్ పనితీరుని మెచ్చుకోవాల్సిందే అంటూ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతే కాకుండా తెలంగాణలో కరోనా పరీక్షలు చేస్తున్న తీరు బాగుందని చెబుతున్నారు.
ఇక బీజేపీ కేంద్ర పెద్దలు కూడా జగన్ పరిపాలన తీరుని ప్రశంసిస్తున్నారు.
ఏపీలో కరోనా కట్టడి విషయంలో గాని , ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరులో కానీ, జగన్ పనితీరును పదే పదే ప్రశంసిస్తున్నారు. కరోనా విపత్తు ను ఎదుర్కొనే విషయంలో జగన్ కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెబుతున్నారు.అంతేకాకుండా సౌత్ కొరియా నుంచి తెప్పించిన కరోనా టెస్టింగ్ రాపిడ్ కిట్లు విషయంలో కూడా కేంద్రం తీరుని ప్రశంసిస్తూ, జగన్ కు అన్ని విషయాల్లోనూ తాము మద్దతు పలుకుతామని చెబుతున్నారు.
ఇవే కాకుండా ఏపీకి సంబంధించి ఏ విషయంలోనైనా జగన్ కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర నాయకులు ప్రతి సందర్భంలోనూ చెబుతున్నారు. దీంతో అసలు బీజేపీ వ్యవహారం ఎవరికి అంతుపట్టడం లేదు.
జగన్ విషయంలో కేంద్ర పెద్దలు ఒక రకంగా ఏపీ, తెలంగాణ నాయకులు మరో రకంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటంతో అసలు బీజేపీ లో ఏకాభిప్రాయం లేదనే విషయం అర్థం అవుతోంది.