అన్ని విషయాల్లోనూ అందరికంటే ముందుగా మేల్కొని, అందరికంటే తమదే పైచేయి ఉండాలి అనే విధంగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తుంటారు ఏపీ సీఎం జగన్. ఏపీలో ప్రభుత్వ పరంగా ఎటువంటి లోపాలు లేకుండా, అన్ని వ్యవహారాలను చక్క బెట్టుకుంటూ, ప్రజలలో చిరస్థాయిగా తన ముద్ర వేయాలని జగన్ చూస్తున్నారు.
అయితే పార్టీలో కొన్ని కొన్ని తప్పిదాల కారణంగా, నాయకులలో సమన్వయం లేకపోవడం, ఆధిపత్యపోరు, గ్రూపు రాజకీయాలు ఇలా ఎన్నో కారణాలతో జగన్ ఆశించినంత స్థాయిలో ప్రభుత్వానికి క్రెడిట్ రావడం లేదు.అయినా ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా , అన్ని వైపుల నుంచి పరిస్థితులను చక్కదిద్దుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఎన్నికలలో ప్రతిపక్షాలకు అవకాశం దక్కకుండా, ఫలితాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసిపి ఇప్పటి నుంచే తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.
అయితే క్షేత్రస్థాయిలో వైసిపి నాయకుల వ్యవహారాల కారణంగా, తాము అనుకున్న ఫలితాలు వచ్చేలా కనిపించకపోవడంతో, ఇప్పటి నుంచే జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలపై కసరత్తు చేస్తున్నారు.ఈ మేరకు త్వరలోనే ఆయన పార్టీ లో కొన్ని కమిటీల నియమించే అవకాశం ఉన్నట్టుగా వైసిపి వర్గాలు పేర్కొంటున్నాయి.
దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందట.ఈ కమిటీని ఏ విధంగా నియమించాలి ? వారి విధి విధానాలు ఏమిటి ? అనే విషయంపై త్వరలోనే పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కొత్తగా నిర్మించబోయే ఒక్కో కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట.ఐదుగురు సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో పర్యటించి, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జి లతో సమావేశం అయ్యి, ఎన్నికలకు సంబంధించి వారి అభిప్రాయాలు, పార్టీ పరిస్థితులను క్షుణ్ణంగా వారితో చర్చించి, తగిన నిర్ణయం తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
ఒక కమిటీ సరిపోదు అనుకుంటే, మరి కొన్ని కమిటీలను నియమించి, విజయం తమ వైపు ఉండేలా, జగన్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు గా కనిపిస్తున్నారు.