పార్టీ నేతలెవరూ అవినీతి వ్యవహారాలకు పాల్పడవద్దని తాను పదేపదే చెబుతున్నా, ఎవరు లెక్క చేయకుండా, యధావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ప్రభుత్వానికి పార్టీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారు అనే విషయంపై చాలా కాలంగా జగన్ గుర్రుగా ఉన్నారు.తాను అవినీతి రహిత పాలన అందిస్తా అని, ప్రజలకు వాగ్దానం చేయడంతోపాటు, ప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులు జోక్యం ఉంటే, తప్పనిసరిగా అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అధికారుల ద్వారా పరిపాలన సాగిస్తున్నా, సొంత పార్టీ నేతలు, కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి వ్యవహారాల్లో యధేచ్చగా పాల్గొనడం, ఈ వ్యవహారాలు ప్రతిపక్షాలు హైలెట్ చేసి ప్రజల ముందు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండడం, ఇలా చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.
జగన్ ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నా, పార్టీ నేతల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు.ముఖ్యంగా ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున పార్టీ నేతల పై ఆరోపణలు వస్తున్నాయి.
పేదలకు ఇళ్లస్థలాలు నిమిత్తం భూములు కొనుగోలు చేసే వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి.ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఈ తరహా తంతు జరుగుతుండడంతో, దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
నేతల అవినీతి వ్యవహారాలకు సంబంధించిన జాబితాను జగన్ సిద్ధం చేసుకున్నారట.ఎవరు మీద ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయో వారి విషయంలో దర్యాప్తు కు కూడా ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది.
తాను ప్రజా సంక్షేమం కోసం, అవినీతి రహిత పాలన కోసం ఎంతగానో తపిస్తూ, పార్టీకి ఇమేజ్ పెరిగేలా చేస్తుంటే, సొంత పార్టీ నేతలే దానిని అర్థం చేసుకోకుండా, అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉండడంపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు.ఇప్పటికే కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా పిలిచి జగన్ వార్నింగ్ ఇచ్చారు.
ఇప్పుడు సొంత నేతలపై దర్యాప్తు చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.