పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది.అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి జగన్ పార్టీ శ్రేణులకు నూరి పోస్తున్న అంశం ఒకటే.
ఎవరూ, ఎక్కడా అవినీతి వ్యవహారాలకు పాల్పడవద్దని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది అంటూ జగన్ పదేపదే చెబుతున్నారు.కానీ క్షేత్రస్థాయిలో మాత్రం జగన్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహారశైలి తరచుగా వివాదాస్పదం అవుతూ, మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు.
అలాగే ఇసుక, ఇళ్ల స్థలాలకు సంబంధించి భూముల కొనుగోలు వ్యవహారం, మైనింగ్ ఇలా ఎన్నో అంశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు సాక్షాలతో సహా దొరికిపోతున్నారు.ఇటీవల కార్మిక శాఖ మంత్రి కుమారుడి బెంజ్ కారు వ్యవహారమూ వైసీపీకి తలనొప్పిగా మారింది.
ఇక దేవాలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు.ఇక అమరావతి ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇటీవల ఓ సీఐ ను ఫోన్ లో బెదిరిస్తున్న ఆడియో క్లిప్ మీడియాలో వైరల్ అయ్యింది.
అలాగే సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మైనింగ్ వ్యవహారం, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలపై నిత్యం ఏదో ఒక ఆరోపణలు అవినీతి వ్యవహారాలు బయటపడుతూ వస్తున్నాయి.ఈ పరిణామాలపై జగన్ తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారు.
ఒకవైపు ప్రభుత్వ పరిపాలనలో తీరిక లేకుండా జగన్ ఉంటుండగా, మంత్రులు ఎమ్మెల్యేల వ్యవహారాలు జగన్ కు తలనొప్పి తీసుకొస్తున్నాయి.ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు, వారి కార్యకలాపాలపై జగన్ పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
క్షేత్ర స్థాయిలో ఎవరు ఏం చేస్తున్నారనే ఫీడ్ బ్యాక్ జగన్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ, సదరు నాయకులకు వార్నింగ్ లు ఇస్తున్నా, షరా మామూలుగానే వ్యవహారాలు నడుస్తుండటంతో, జగన్ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.