అకస్మాత్తుగా ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం, కేంద్ర బిజెపి పెద్దలతో భేటీ అవ్వడం , కీలక విషయాలపై సుమారు గంటసేపు చర్చించడం ఇవన్నీ ఏపీలో ఎన్నో చర్చలకు దారి తీస్తోంది.అసలు ఇంత అకస్మాత్తుగా జగన్ ఢిల్లీ కి వెళ్లడానికి గల కారణాలు ఏమిటి అనే విషయం తెలియక పోవడంతో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.
జగన్ తనంతట తానుగా ఢిల్లీకి వెళ్లలేదని, ఏపీలో జరుగుతున్న పరిణామాలపై బిజెపి ఆగ్రహంగా ఉండడంతో ఢిల్లీ జగన్ ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు గా టిడిపి అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే వైసీపీ శ్రేణులు వాదన మరోలా ఉంది.
ఏపీకి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు జగన్ వెళ్లారని, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకులు అంతా అందుబాటులో ఉంటారు కాబట్టి, ఏపీ కి సంబంధించిన అనేక సమస్యలు, నిధుల విడుదలతో పాటు మరి కొన్ని రాజకీయ అంశాలను చర్చించేందుకు మాత్రమే ఈ పర్యటన అంటూ చెబుతున్నారు.అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హిందూ దేవాలయాల విషయంలో బిజెపిని టిడిపి తప్పుదోవ పట్టిస్తోందని, ఇందులో ప్రభుత్వ తప్పిదం ఏమీ లేదని, అదంతా అనుకోని ప్రమాదం అని జగన్ అమిత్ షా కు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే కేంద్రంలో బిజెపి కి ఎప్పుడు మద్దతు అవసరమైనా, తాము ఇస్తున్నామని, రాజ్యసభలో కీలక బిల్లులను పాస్ చేసే క్రమంలో బిజెపికి అనుకూలంగానే తాము ఓటింగ్ లో పాల్గొంటున్నామని, ఏపీలో బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు చేస్తున్నా, తాము మాత్రం సంయమనం పాటిస్తున్నామని, బీజేపీతో తాము విరోధం కోరుకోవడం లేదని, ఇలా ఎన్నో విషయాలపై జగన్ క్లారిటీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.ఏపీలో గత టిడిపి ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, దానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో సీబీఐ రంగంలోకి దించేలా తమకు సహకరించాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది.
ఇవే కాకుండా టిడిపి సంబంధించి అనేక విషయాలపై చర్చించి కీలకమైన హామీలు పొందారని, జగన్ విషయంలో అమిత్ షా సానుకూలంగా స్పందించారని వైసీపీ మీడియా ప్రచారం చేస్తుంది.అలాగే ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులపైన, పోలవరం ప్రాజెక్టు విషయంపైన, అమిత్ షాతో జగన్ చర్చలు జరిపి సానుకూలమైన హామీలు పొందారట.జగన్ ఆకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లడం, భవిష్యత్తు పరిణామాలపై టిడిపి శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తిగా తనను టార్గెట్ చేసుకుందని, ఇప్పుడు కేంద్ర బీజేపీ పెద్దలు టిడిపి విషయంలో తలదూర్చితే మరింతగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాందోళనలో వారు ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.