ఇప్పుడు నడిచే వన్నీ డబల్ గేమ్ పాలిటిక్స్.పైకి ఒక మాట, లోపల మాట అన్నట్టుగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి.
ఏపీ రాజధాని గా గతంలో ప్రకటించిన అమరావతి విషయంలో రాజకీయ పార్టీల వైఖరి అనుమానాస్పదంగా ఉంటూనే వస్తోంది.ముఖ్యంగా కేంద్ర అధికార పార్టీ బిజెపి విషయంలో స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతోంది.
రాష్ట్ర నాయకులు ఒకవిధంగా స్పందిస్తుంటే, కేంద్ర బిజెపి నాయకుడు మరో విధంగా మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తున్నారు.మొదటి నుంచి బిజెపి వైఖరి ప్రతి విషయంలోనూ ఇదే విధంగా ఉంటూ వస్తోంది .కేంద్ర బిజెపి పెద్దలు ఒక విధంగా మాట్లాడితే, రాష్ట్ర బీజేపీ నేతలు మరో విధంగా మాట్లాడుతూ, బిజెపిలో ఏ విషయంపైనా స్పష్టమైన క్లారిటీ తో ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు.ప్రస్తుతం ఏపీలో అమరావతి వ్యవహారం మళ్లీ రాజుకుంది.
తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయంగా మరింత బలపడి అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనే ప్రణాళికతో ముందుకు వెళుతోంది.
ఏపీలో బీజేపీకి ఈ విషయంలో క్రెడిట్ దక్కేలా చేసుకునే క్రమంలో ఇలా అభాసుపాలవుతోంది.
అమరావతి ప్రాంత వాసులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలియజేశారు.అలాగే బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సైతం రాజధాని రైతులకు మద్దతు ప్రకటించడమే కాకుండా, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అమరావతి ఒక్క అంగుళం కూడా కదిలించలేరు అని, కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి పెట్టబోతోంది అంటూ ఊరట కలిగించే విధంగా మాటలు చెప్పడంతో, రైతుల్లో మరింత ధైర్యం పెరిగింది.
ఇదిలా ఉండగానే ఆకస్మాత్తుగా ఏపీ బీజేపీ ఇంచార్జ్ సునీల్ దియోదర్ కూడా స్పందించారు.అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసే విషయంలో తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
కాకపోతే ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని, దీంట్లో కేంద్రం జోక్యం చేసుకోదు అని చెప్పారు.అలాగే భవిష్యత్తులో జోక్యం చేసుకునే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పేశారు.
అంతకు ముందే కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని, సీరియస్ గా ఉందని సుజనాచౌదరి చెప్పడం, ఇప్పుడు సునీల్ దియోధర్ ఈ విధంగా వ్యాఖ్యానించడంతో అమరావతి విషయంలో బిజెపి మైండ్ గేమ్ ఆడుతోంది అనే అభిప్రాయాలు రైతుల్లో వ్యక్తమవుతోంది.స్పష్టంగా అమరావతికి మద్దతు ఉంటుందా లేదా అనే విషయాన్ని బీజేపీ నాయకులు చెప్పలేకపోతున్నారని ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేంద్ర అధికార పార్టీ గా ఉన్న బిజెపి అమరావతి ఇక్కడ ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉన్నా, అలా చేయకుండా తమ మద్దతు మాత్రమే ఉంటుందని, రాజధానిని తరలిస్తే తాము అడ్డు చెప్పను అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, ఈ విషయంలో బిజెపి తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.