ఆపసోపాలు పడుతూ, ఏపీలో బలం పెంచుకునేందుకు తెగ తాపత్రయ పడుతున్న బీజేపీ నేతలకు ఇప్పుడు బీజేపీ పెద్దలే శత్రువులుగా మారారు.ఏపీలో పాగా వేయాలని బీజేపీ ఎప్పటినుంచో కలలు కంటోంది.
ఇప్పుడిప్పుడే ఆ కలలు సాకారమయ్యే పరిస్థితి కనిపిస్తోంది అనుకుంటున్న సమయంలో, కేంద్ర బీజేపీ పెద్దల నిర్ణయాలు బీజేపీ నాయకులకు సంకటంగా మారింది.జనాల్లోకి వెళ్లాలంటే భయాందోళనలు కలిగించే విధంగా పరిస్థితులు తీసుకువచ్చాయి.
మొన్నటి వరకు ఏదో ఒక అంశంపై ఏపీ ప్రభుత్వం పైనా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పైనా, విమర్శలు చేస్తూ రాజకీయంగా పై చేయి సాధిస్తూ వచ్చిన బీజేపీకి కేంద్ర బిజెపి పెద్దల విషయంలో అనుసరిస్తున్న వైఖరి కారణంగా వచ్చిన క్రెడిట్ అంతా పోగా, కనీసం జనాల్లోకి వెళ్లి సమాధానం చెప్పుకునే పరిస్థితి ని తీసుకు వచ్చాయి.ఏపీకి ప్రత్యేక హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు కేంద్ర బిజెపి పెద్దలు అనుసరిస్తున్న వైఖరి ఇబ్బందికరంగా మారింది.
తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడలేని అపఖ్యాతిని మూటగట్టుకుంది.చెప్పుకోడానికి జాతీయ పార్టీ అయినా, కనీసం పంచాయతీ ఎన్నికలలో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
అసలు ఏపీలో బలం లేదని, తమ పైనే ఆధారపడి ఉంది అనుకుంటూ వచ్చిన జనసేన సైతం మెరుగైన ఫలితాలు సాధించి, ఆ పార్టీ నాయకుల్లో ఉత్సాహం కలిగించే విధంగా చేసుకోగలిగింది.కానీ బీజేపీకి ఆ పరిస్థితి లేదు.
ఇక మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం పై ఆలయాలపై దాడులు, అంతర్వేది రథం దగ్ధం వంటి వ్యవహారాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది.ఆందోళనలు, ధర్నాలు చేస్తూ హడావుడి చేసింది.
కానీ ఆ క్రెడిట్ బీజేపీకి దక్కకుండానే ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారాలను సిబిఐకి అప్పగించింది.అంతేకాకుండా అంతర్వేది ఆలయ కొత్త రథాన్ని తయారుచేయించి ప్రారంభించింది.
ఏపీ బీజేపీ నేతలు రామతీర్థం నుంచి శ్రీశైలం వరకు రథయాత్ర చేపడతామని చూసినా, ఆచరణకు నోచుకోలేదు.
ఇక ఇప్పుడు చూసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అనే కారణం చూపించి కేంద్ర బీజేపీ పెద్దలు ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధం అవ్వడం, ఈ విషయం నీతిఅయోగ్ ట్విట్ తో బయటకు రావడంతో పెద్ద ఎత్తున విశాఖలో ఆందోళనలు మొదలయ్యాయి.ఈ వ్యవహారంలో బిజెపిని కార్నర్ చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ,కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు.ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం రాజీనామా చేశారు.ఇక ఏపీ సీఎం జగన్ తో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం విశాఖకు వెళ్లారు.
ఇదంతా కేంద్రం ఏపీ పై కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తోందని చెప్పి ఆ వ్యవహారం తమకు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఏపీ బీజేపీ నేతలు ఉండిపోయారు.
దీనిపై కేంద్ర బీజేపీ పెద్దలను కలిసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రయత్నించినా, ప్రధాని నరేంద్రమోదీ కనీసం వీర్రాజుకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, అమిత్ షా సైతం ఈ వ్యవహారాన్ని పట్టించుకోనట్టుగా వ్యవహరించడం వంటి కారణాలతో, ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు జనాల్లోకి వచ్చేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.వాస్తవంగా చెప్పుకుంటే ఏపీ బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది విశాఖ మాత్రమే.గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు విశాఖ నుంచే బీజేపీకి ప్రాధాన్యం ఉండేది.
కానీ ఇప్పుడు అదే గట్టి పట్టున్న ప్రాంతాల్లో కేంద్ర బీజేపీ పెద్దల నిర్ణయం కారణంగా బీజేపీ మరిన్ని కష్టాల్లోకి వెళ్లి పోయింది.
ఇప్పుడు ఏ అంశంపైన అయినా జనాల్లోకి వెళదామన్నా, ఏపీ బీజేపీ నేతలపై పోరాటం చేద్దామని ప్రయత్నించినా, చివరకు విశాఖ ఉక్కు విషయంలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
విశాఖ ఉక్కు వ్యవహారం ఏపీ బీజేపీ నేతలకు ముందరి కాళ్ల బంధంలా మారిపోయింది.ఇప్పుడు ఏపీ బీజేపీకి కేంద్ర బీజేపీ పెద్దలే శత్రువులుగా మారిపోయినట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.