సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి , ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్నారు.బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్న వీర్రాజు సొంత పార్టీ నేతలను సైతం భయపెట్టే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి.
కరుడుగట్టిన బీజేపీ వాదిగా ముద్ర వేయించుకున్న వీర్రాజు ఎటువంటి మొహమాటం లేకుండా, బీజేపీని ఏపీలో బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నారు.క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని, ఎంతటివారినైనా ఉపేక్షించబోమని , సస్పెండ్ చేసేందుకు సైతం వెనుకాడబోమని సంకేతాలు ఆయన ఇస్తున్నారు.
ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ తప్పి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలతో, పార్టీలోని కొంత మంది నేతలను సస్పెండ్ చేసి వీర్రాజు సంచలనం సృష్టించారు.పార్టీలో ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం పాటు పడే వారు మాత్రమే బీజేపీలో ఉండాలని, మిగతా వారికి స్థానమే లేదని ఆయన మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అంశాలపైన కానీ, ఏదైనా విషయంపై ఎక్కడైనా స్పందించాలన్నా, ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడితే కుదరదని, తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని క్లారిటీ ఇచ్చేసారు.
సదరు నాయకులు ఏ విషయం పైన అయినా మాట్లాడాలి అంటే, దానికి సంబంధించిన స్క్రిప్టు మొత్తం ముందుగా తనకు పంపించాలని, తన అనుమతి వచ్చిన తర్వాతే వారు మాట్లాడాలని, ఇలా ఎన్నో కండిషన్ లు పెట్టడంతో బీజేపీ ఏపీ నేతలు రగిలిపోతున్నారు.
మరి అంత అతి క్రమ శిక్షణ అవసరమా అంటూ సోము వీర్రాజు తీరును ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
ఆ పార్టీ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నా, ముందుకు వస్తున్నట్లుగా కనిపించడం లేదు.ఇతర పార్టీల్లోని నాయకులు ఎవరూ, బీజేపీ లోకి వచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు.
జనసేన పార్టీతో పొత్తు ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకాలు ఎవరిలోనూ లేకపోవడంతో, బీజేపీ లో చేరికలు కనిపించడం లేదు.ఈ స్థాయిలో క్రమశిక్షణ ఉండడంతో, పార్టీలోకి చేరదామని చూస్తున్న నాయకులు సైతం వెనుకంజ వేస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.
వీర్రాజు మాత్రం నాయకులు వచ్చి చేరినా, చేరకపోయినా క్రమశిక్షణ విషయంలో రాజీ పడేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.ఈ పరిణామాలు ఏపీ బీజేపీని ఎక్కడ వరకు తీసుకువెళతాయో చూడాలి.