జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కు అమాంతం ప్రేమ పెరిగినట్లుగా కనిపిస్తోంది.మొన్నటి వరకు అనేక అంశాలలో జనసేన ను కలుపుకు వెళ్లకుండా, బీజేపీనే ఒంటరిగా ఏపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు చేస్తూ, హడావుడి చేసింది.
ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలతో పాటు, తెలంగాణలోనూ పవన్ అవసరం ఏర్పడడంతో, బీజేపీ మళ్లీ పవన్ కు ప్రాధాన్యత పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది.తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలు చూస్తే ఇది నిజమే అనే విషయం తేలుతోంది.
మూడు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి సిపిఐ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పవన్ తో పొత్తు పెట్టుకుని చాలా తప్పు చేశామని చెప్పడంతో పాటు, పవన్ మూడు పెళ్లిళ్లు అంశాన్ని ప్రస్తావించారు.
నారాయణ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.కానీ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి మాత్రం నారాయణ వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.
పవన్ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడంతో పాటు, సిపిఐ పైన విమర్శలు చేశారు.అసలు ఆ పార్టీ తో పొత్తు పెట్టుకోని పార్టీ అంటూ ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన బీజేపీ పొత్తు పెట్టుకోవడం, కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండటం వంటి పరిణామాలతో నారాయణ వ్యాఖ్యలు సోము వీర్రాజు కు ఆగ్రహం కలిగించినా, ఆశ్చర్యపడనవసరం లేదు.
అయితే ఇదే సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన ఏపీ నేత దగ్గుబాటి పురంధరేశ్వరి పై వైసీపీ నేతలు అనేక విమర్శలు చేశారు.
కుల ప్రస్తావన తీసుకు వచ్చి మరీ ఘాటుగా విమర్శలు చేశారు.అయినా ఈ వ్యాఖ్యలపై ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, ఏపీ బీజేపీ నేతలంతా మౌనంగా ఉండిపోయారు.
ఈ విమర్శలపై స్పందించాల్సిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము సైతం సైలెంట్ అయిపోవడం, పవన్ విషయంలో సిపిఐ నారాయణ విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పడంపై ఇప్పుడు పార్టీలోనే చర్చ నడుస్తుంది.
బీజేపీలో ఇప్పటికే రెండు గ్రూపులు ఉన్నాయని, ఒక గ్రూపు వైసీపీకి మద్దతు ఇస్తుండగా, మరో గ్రూపు టీడీపీ కి అనుకూలంగా ఉంటూ, వైసీపీ ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయనే అభిప్రాయాలు ఉన్న సమయంలోనే సోము వీర్రాజు ఈ విధంగా వ్యాఖ్యానించడం వాటికి మరింత బలం చేకూరుస్తోంది.