కేంద్రంలో అధికారం లో ఉన్న పార్టీతో కోరి కయ్యం తెచ్చుకుంటే ఆ తరువాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అన్న విషయం తెలుగుదేశం పార్టీని ఉదాహరణగా చుసిన వారందరికీ అర్ధం అయిపోతుంది.ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆ విధంగానే తెగ బాదపడిపోతున్నాడు.
కేంద్రంతో అనవసరంగా కయ్యం పెట్టుకుని ఓటమి చెందామని, కానీ ఆ పార్టీతో సఖ్యతగా ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉండేదని పార్టీ శ్రేణులతో చెప్పుకుంటూ బీజేపీతో సయోద్యకు ప్రయత్నిస్తున్నాడు.అయితే ఆ పార్టీ నుంచి మాత్రం సానుకూల సమాధానం రాలేదు.
టీడీపీ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం , అవకాశం తమకు లేదని బీజేపీ ప్రకటించేసింది.ఇక ఇప్పడు చూస్తే కేంద్రంతో సత్సబంధాలు కొనసాగించిన వైసీపీ మెల్లిమెల్లిగా బీజేపీతో వైరం పెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ విషయంలో ముందుగా బీజేపీ పార్టీనే కవ్వింపు చర్యలకు దిగుతూ వైసీపీని ఇబ్బందిపెడుతున్నట్టు కనిపిస్తోంది.పాలనా పరమైన అంశాలలో ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం తరచు తప్పుబడుతోంది.పోలవరం రివర్స్ టెండర్లపై ఆ ప్రాజెక్ట్ అథారిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం టెండర్ల రద్దును మరోసారి ఏపీ ప్రభుత్వం ఆలోచించుకోవాలని సూచించింది.కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు ససేమీరా అంది.
రివర్స్ టెండర్ ద్వారా మేఘా కంపెనీకి పోలవరం కాంట్రాక్టును అప్పగించడంతో కేంద్రం వైసీపీ మీద ఆగ్రహంగా ఉంది.
ఇక పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న పునఃసమీక్షలను కేంద్రం తప్పుపట్టింది.విద్యుత్ ఒప్పందాలు కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదని, పునఃసమీక్షలకు వెళ్తే అది దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు, ఇతర దేశాల నుండి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని కేంద్రం హెచ్చరించినా జగన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఇలా ప్రతి విషయంలోనూ జగన్ ప్రతిష్టకు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అవమానిస్తూ వెళ్లడంపై బీజేపీ అగ్ర నేతలు జగన్ తీరుపై మండిపడుతున్నారు.ఇక మీ పని మీదే మా పని మాదే అన్నట్టుగా కేంద్రం వైసీపీతో తాడో పేడో తేల్చుకునే పనిలో పడింది.