రాజకీయ కష్టాలు అంటే ఏమిటో ఏపీ బిజెపి నేతలకు బాగా తెలిసి వచ్చినట్లుగా కనిపిస్తోంది ఇప్పటివరకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, ఏపీ బిజెపి నేతలు పార్టీని ఇబ్బంది లేకుండానే నెట్టుకొస్తున్నారు.అయితే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికలు ఎదుర్కొనేందుకు రంగంలోకి దిగడం, ఈ ఎన్నికల ఫలితాలు బిజెపి భవిష్యత్తు తో పాటు, రాష్ట్ర స్థాయి నేతల జాతకాలను తారుమారు చేసేవిగా ఉండడంతో, ఏపీ బిజెపిలో కీలక పదవులు పొందిన వారంతా ఆందోళన చెందుతున్నారు.
జనసేన పార్టీ సహకారం లేకపోయినా, బీజేపీకి ఇబ్బందులు మాత్రం తప్పవు అన్నట్లుగానే పరిస్థితి మారిపోయింది.దీనికి కారణాలు అయితే చాలానే ఉన్నాయి.
బిజెపి అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న రత్నప్రభ ను తిరుపతి లోక్ సభ పరిధిలో జనాలకు పరిచయం చేయడం పెద్ద ఇబ్బంది గా మారిందట.అంతేకాకుండా, కేంద్రంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలపై సామాన్య జనంలో నిరసనలు వ్యక్తమవుతుండడం, ఆ ప్రభావం ఇప్పుడు బాగా కనిపించేలా ఉండడంతో, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
చాలాకాలం నుంచి ఏపీకి కేంద్రం బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే బాధ ప్రతి ఒక్కరిలోనూ ఉంది.దీనికి తోడు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు , ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం, ఇలా చాలా అంశాలు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.
ఎన్నికల ప్రచారం సందర్భంగా అనేక మంది సామాన్య జనం బిజెపిపై ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని నిలదీస్తూ ఉండడం తో ప్రచారానికి నేతలు ఇబ్బందులు పడుతున్నారట.
అది కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్ప , ప్రజలను ఆకట్టుకునే నాయకులు లేకపోవడం, తిరుపతి లోక్ సభ పరిధిలో గెలిస్తే తాము ఏమేమి పనులు చేయగలము అని గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉండడం, ఇలా ఎన్నో అంశాలు బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.దీనికి తోడు పూర్తిగా జనసేన మద్దతు ఉంటుందా లేదా అనేది ఏపీ బీజేపీ నేతలకు సందేహం గా మారిపోయింది.అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన మొదట్లో రత్నప్రభ ఆయనకు అనుకూలంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం, జగన్ ప్రశంసించడం ఇప్పుడు అది బయటకి రావడం మరింత ఇబ్బందికరంగా మారింది.
ఇలా ఎన్నెన్నో అంశాలు బిజెపి ఏపీ నేతలకు బిపి తెప్పిస్తున్నాయట
.