అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్టుగా తయారైంది ఏపీ బీజేపీ నేతల పరిస్థితి.ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీనం అవుతుండడం, 2024 నాటికి ఆ పార్టీలోని నాయకులు నిరాశ నిస్పృహల్లో ఉండడం, జనాలు సైతం టిడిపిని మర్చిపోయే పరిస్థితి వస్తుందనే అంచనా లో ఏపీ బీజేపీ నాయకులు ఉన్నారు.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని మరింత దెబ్బ తీసే విధంగా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, నాయకుల అవినీతి వ్యవహారాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు.ఏదో రకంగా తెలుగుదేశం స్థానాన్ని దక్కించుకుని పై చేయి సాధిస్తామనే ఆశాభావం సైతం వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా, అధికార పార్టీ వైసీపీ విషయంలో మొదట్లో సఖ్యతగా ఉన్నట్టు కనిపించినా, తరువాత, ఏపీ ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, వైసిపి బలం జనాల్లో తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికోసం అందివచ్చిన అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్లారు.
అంతర్వేది లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రథం కాలిపోవడం , దుర్గమ్మ ఆలయానికి ఉన్న వెండి సింహాలు మాయమవడం, తిరుమలలో జగన్ డిక్లరేషన్ అంశంపైన, మరికొన్ని వ్యవహారాలపైన ఏపీ బీజేపీ నాయకులు గట్టిగానే పోరాటాలు చేశారు.వైసీపీని రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసి, జనసేన సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించి 2024 నాటికి అధికారం దక్కించుకోవాలనే తపనతో గట్టిగానే శ్రమపడ్డారు.
ఈ వ్యవహారాలతో ఏపీ బీజేపీపై జనాల్లో చర్చ మొదలవడం, బిజెపి కూడా అధికారం దక్కించుకునే అంత స్థాయికి వెళ్తుందనే చర్చ జరగడం వంటివి ఏపీ బీజేపీ నేతలకు మహా ఆనందాన్ని కలిగించాయి.
కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవకుండా, కేంద్ర బిజెపి పెద్దలు వ్యవహరించడం, ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, జగన్ నిర్ణయాలకు మద్దతు పలకడం, అన్ని విధాలుగా సహకరిస్తామనే సంకేతాలు ఇవ్వడం వంటివి చేస్తూ వచ్చారు.ఏపీలో బీజేపీ పోరాటం చేస్తూ వచ్చిన అమరావతి వ్యవహారంపై కేంద్రం జగన్ కు పరోక్షంగా మద్దతు పలకడం వంటివి చేసింది.కేంద్రంలో బిజెపికి వైసీపీ ఎంపీల అవసరం ఎక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ ను దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా, జగన్ ను పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇవ్వడం, ఎన్డీఏ లోకి వైసీపీ ని చేరాలని కోరడం వంటి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో, ఇక వైసిపి, బిజెపి మిత్రపక్షాలుగానే కొనసాగే పరిస్థితి ఏర్పడింది.
అంటే ఇక ముందు ముందు ఏపీలోనూ వైసీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎన్నో ఆశలతో అధికారం కోసం ఏపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వచ్చిన ఏపీ బీజేపీ నేతలకు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం మింగుడు పడడం లేదు.ఇప్పటి వరకు తాము రోడ్డెక్కి పోరాటాలు చేసిన శ్రమ అంతా వృధా అయిందని, ఇప్పుడు జగన్ కు జై కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏపీ బీజేపీ నేతలతో పాటు, పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు.