బలమైన పార్టీగా ఏపీలో అవతరించాలని తహతహలాడుతున్న కేంద్ర అధికార పార్టీ బిజెపికి అనుకోకుండా వైసిపి అధినేత జగన్ షాకులు ఇస్తూనే ఉన్నారు.ఒక్క బీజేపీ నే కాదు టిడీపి కూడా జగన్ మూడు రాజధానుల వ్యవహారంలో చిక్కుకుని విలవిలలాడుతోంది.
అయితే తెలుగుదేశం అమరావతి విషయంలో గట్టిగానే పోరాడాలని నిర్ణయించుకుని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజల మద్దతు కూడగట్టుకుని వైసిపి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెంచే దిశగా అడుగులు చేస్తుండగా, బీజేపీ మాత్రం ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మొదట్లో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం అంటూ జగన్ తీసుకున్న మూడు రాజధానులు ఆలోచనకు మద్దతు పలికారు.
అనేక చోట్ల ఇదే విషయమై ఆయన మెచ్చుకున్నారు.ఆ తరువాత అమరావతి ప్రాంతంలో బిజెపి, కన్నా తీరుపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాలుక కరుచుకుని అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ అక్కడి రైతుల కు మద్దతుగా ఒక గంటపాటు మౌనదీక్ష చేశారు.
మరో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అయితే ఈ విషయంలో జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అందరికంటే ఎక్కువగా హడావుడి చేస్తున్నారు.ఆయనకు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయని, అందుకే ఇంతగా విమర్శలు చేస్తున్నాడనే విమర్శలు ఆయనపై వస్తున్నాయి.బిజెపి మరో ముఖ్య నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి.కర్నూలు ను రాజధానిగా చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని, జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయాన్ని తాను ఆమోదిస్తున్నాను అంటూ ప్రకటించారు.
అలాగే బిజెపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం రాజధాని వ్యవహారం రాష్ట్ర పరిధిలోని దీంట్లో కేంద్రం జోక్యం చేసుకోదు అంటూ స్పందించారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా విశాఖపట్నం రాజధానిగా చేయడాన్ని తాను సమర్థిస్తున్న అంటూ ప్రకటన చేయడంతో ఏపీ బీజేపీ నాయకులు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.అసలు తమ పార్టీ రాజధాని విషయంలో ఏ విధమైన క్లారిటీకి వచ్చిందో తెలియక కార్యకర్తలు గందరగోళంలో ఉండిపోయారు.మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో బిజెపి మూడు నాలుగు గ్రూపులుగా విడిపోయినట్టుగా అర్ధం అవుతోంది.
బీజేపీలో జగన్ పెద్ద చిచ్చే రేపాడు.మరి ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.