ఏపీలో జనసేన బీజేపీ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతున్నా, ఎవరికి వారు విడివిడిగా ఎత్తులు వేస్తూ ఉండడంతో రెండు పార్టీల వ్యవహారశైలిపై జనాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జనాల్లోనే కాదు, రెండు పార్టీల నాయకులలోనూ ఇదే అనుమానం కలుగుతోంది.
అసలు పొత్తు ఎందుకు పెట్టుకున్నామో … పొత్తు ఉద్దేశం ఏమిటో రెండు పార్టీ నాయకులకు అర్థంకాని పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఉమ్మడిగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపించడం లేదు.జనసేన ప్రమేయం లేకుండానే బిజెపి తిరుపతి ఎన్నికలలో తమ అభ్యర్ధిని పోటీకి దింపుతామని ప్రకటించేసింది.
అంతే కాదు దీనిని జనసేన బలపరుస్తుంది అంటూ సోము వీర్రాజు ప్రకటించిన దగ్గర నుంచి బీజేపీ పై జనసేన నాయకులు మండిపడుతున్నారు.
కనీసం తమ అభిప్రాయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే సోము వీర్రాజు ప్రకటన చేయడం బిజెపి అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారం బహిరంగంగా వ్యాఖ్యానించకుండానే సొంతంగానే జనసేన పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు.తిరుపతి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
రైతులను పరామర్శించే పేరుతో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని జిల్లాల్లో పవన్ పర్యటించారు.గ్రేటర్ లో బిజెపి కోసం ఎన్నికల బరి నుంచి తప్పుకున్నాము కాబట్టి, ఆ త్యాగాలను గుర్తించి తిరుపతి సీటును కేటాయించాలని జనసేన పట్టుబడుతోంది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఏపీ బిజెపి నాయకులు సోము వీర్రాజు జీవీఎల్ నరసింహారావు వంటి నాయకులపై పవన్ డిల్లీలోని జాతీయ నాయకులకు ఫిర్యాదు చేసినట్లు ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.తాజాగా ఏపీ బీజేపీ నేతలను బీజేపీ అగ్రనేతలు ఢిల్లీకి పిలిచారని జనసేన చెప్పుకుంటోంది.మిత్రపక్షమైన జనసేన పార్టీ ఆకాంక్షలకు కనీసం గౌరవం ఇవ్వకుండా బిజెపి వ్యవహరిస్తున్న తీరు బహిరంగంగానే జనసేన తప్పు పడుతోంది.ఇదిలా ఉంటే బిజెపి నాయకులు మాత్రం జనసేన తీరు పై మండిపడుతున్నారు.
జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదని, కేవలం అభిమానుల అండతోనే పవన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమపై ఢిల్లీలో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధిష్టానం పెద్దలు వద్దే తేల్చుకుంటాము అంటూ ఏపీ బీజేపీ నేతలు జనసేన వైఖరిని తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది.