ఏపీలో పట్టు పెంచుకునేందుకు బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు.రకరకాల రాజకీయ ఎత్తుగడలు వేస్తూ, ఎలాగైనా అధికారం సంపాదించాలని బిజెపి ఆశలు పెట్టుకుంది.
అందుకే మొదటి నుంచి సొంతంగా బలపడేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తూనే టిడిపి, జనసేన పార్టీ ల తో పొత్తు పెట్టుకుంది.ఆ తరువాత వైసీపీతో పరోక్షంగా పొత్తు పెట్టుకుని 2019లో ఎన్నికలకు వెళ్లింది.
అయినా పెద్దగా బీజేపీకి కలిసి రాలేదు.ఇక ఆ తర్వాత జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం కొనసాగిస్తూ వస్తోంది.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న, లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్న, ఏపీలో బలమైన పార్టీగా బిజెపిని తీర్చిదిద్ది అధికారం సంపాదించాలనే ఆకాంక్ష ఆ పార్టీ అగ్రనేతల్లో ఎక్కువగా ఉంది.దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ వల్ల పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయంతోనే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సోము వీర్రాజు ను తీసుకువచ్చి బిజెపి అధ్యక్షుడిగా నియమించారు. అది కాకుండా ఏపీలో కీలకమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, సోము వీర్రాజు ద్వారా ఏపీలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని అధిష్టానం పెద్దలు నమ్మారు.అయితే ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
పార్టీ ఎక్కడా పుంజుకున్నట్లు కనిపించకపోవడంతో, సోము వీర్రాజు ను ఆ పదవి నుంచి తప్పించాలనే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.అసలు వీర్రాజు ద్వారా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టి పట్టు సాధించాలని బిజెపి ప్రయత్నించినా, పెద్దగా అది సాధ్యం కాకపోవడంతో , ఇప్పుడు కొత్త అధ్యక్షుడిని రాయలసీమ నుంచి ఎంపిక చేయాలని చూస్తోందట.
ఈ మేరకు జగన్ సొంత జిల్లా కడపకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం.జగన్ కు బద్ధశత్రువుగా ఉన్న ఆదినారాయణరెడ్డి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో బీజేపీకి తమ ప్రాంతంలో కాస్తో కూస్తో కలిసి వచ్చేలా చేశారు.దీంతో ఆయన అయితేనే బాగుంటుందని, ప్రస్తుతం తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయిన వైసీపీని ఆయన అయితే ఎదుర్కోగలరని, ఈ జగన్ ను విమర్శించే క్రమంలో సోము వీర్రాజు మొహమాటం పడుతుంటారు అని బిజెపి నమ్ముతున్న నేపథ్యంలోనే ఆదినారాయణ రెడ్డి బిజెపి ఏపీ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.ఒక వేళ ఇదే జరిగితే సోము వీర్రాజును అధిష్టానం పెద్దలు ఏ విధంగా సంతృప్తి పరుస్తారో చూడాలి.