జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా, రాజకీయంగా ఆయన ఇంకా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు.కోట్లాది మంది అభిమానుల అండదండలు పవన్ కు ఉన్నా, రాజకీయంగా పై చేయి సాధించలేకపోవడం జనసేనకు ఇబ్బందికరంగా మారింది.
ప్రస్తుతం బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు వెళుతున్నాయి.జనసేనతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి.అయితే గతంలో చేసిన కొన్ని తప్పులు ఇప్పుడు పవన్ ను వెంటాడుతూ, ఇబ్బంది పెడుతున్నాయి.2014 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అనుకున్నా, పవన్ పోటీకి దూరంగా ఉన్నారు.టీడీపీ, బీజేపీ ల కూటమికి మద్దతు ఇస్తూ, కేవలం వైసీపీ పై విమర్శలు చేస్తూ వచ్చారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా, కేవలం విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు.
దీంతో పవన్ పై టీడీపీ ముద్ర బలంగా పడిపోయింది.ఈ ముద్ర నుంచి బయటపడేందుకు పవన్ కు ఇప్పటికీ సాధ్యపడటం లేదు.ఇదంతా పవన్ కు రాజకీయంగా ఇబ్బందులు సృష్టిస్తున్నాయి.ఇక ఇప్పుడు పవన్ తో పొత్తు పెట్టుకున్న బీజేపీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, అధికారం దక్కించుకోవాల్సిన దిశగా అడుగులు వేయాల్సి ఉన్నా, బిజెపి నేతలు వాటిపై దృష్టి పెట్టకుండా, ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, తమ మిత్రపక్షమైన పవన్ ను, బిజెపి నాయకులను ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.
కేవలం 2024 ఎన్నికలకు వెళ్లాలని బిజెపి చూస్తోంది.అయితే పవన్ బాట పట్టిన బీజేపీ కి అది కలిసి వస్తుందా అనేది పెద్ద అనుమానంగా ఉంది.కానీ ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వరుసగా పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ వస్తున్న వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ దడ పుట్టిస్తున్నారు.ఎన్ని రకాలుగా హడావుడి చేసినా బీజేపీ మాత్రం క్షేత్ర స్థాయిలో బలం పూనుకునే పరిస్థితిలో ఉన్నట్టుగా కనిపించడంలేదు.
బీజేపీ ఇప్పటికైనా తేరుకుని పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టిపెట్టకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందికర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.