ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఆశలు ఎప్పుడు అడియాసలు గానే మిగిలిపోతున్నాయి.దీనికి ఆ పార్టీ స్వీయ తప్పిదమే కారణంగా తెలుస్తోంది.
కేంద్రంలో నాయకుల మాటలు ఒక విధంగా ఉంటే, ఏపీలో బీజేపీ నాయకులు వ్యవహారం మరోలా ఉంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.అసలు కేంద్ర బిజెపి పెద్దలకు , ఏపీ బిజెపి నాయకులకు మధ్య సమన్వయం లేదనే విషయం ప్రతి సందర్భంలోనూ రుజువు అవుతోంది.
దీంతో బిజెపి డబుల్ గేమ్ ఆడుతోందనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.మొదటి నుంచి చూస్తే బిజెపి నేతలు అధికార పార్టీ వైసీపీ పై ఘాటుగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు.
అయితే అదే సమయంలో ఏపీలో బీజేపీ నేతలు కొంతమంది వైసీపీకి మద్దతుగా నిలబడు తుండగా మరికొంతమంది మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, త్వరలో ఏపీ బీజేపీ పగ్గాలు అందుకోబోతున్న ఎమ్మెల్సీ మాధవ్, మరో యువ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇలా అందరూ వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
అయితే ఈ నేతలు విమర్శలు చేస్తున్న అంశాలపై కేంద్రం మాత్రం వైసిపి కి అనుకూలంగా వ్యవహరిస్తూ, తమ మద్దతును తెలియజేస్తూ ఉండడంతో ఏపీ బీజేపీ నేతలు అబాసుపాలు అవుతున్నారు.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఏపీ బీజేపీ నాయకులు నామినేషన్లు వేయకుండా, వైసిపి దాడులకు పాల్పడడం, తరిమి తరిమి కొట్టడం ఇవన్నీ ఏపీ బీజేపీ నేతలు బీజేపీ అగ్ర నేతల దృష్టికి తీసుకు వెళ్లారు.
చివరకు ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా వైరస్ కారణంగా ఎన్నికలు వాయిదా చేస్తున్నామంటూ ప్రకటించారు.అయితే దీనిపై వైసీపీ ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.
చివరకు ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికల కమిషనర్ తొలగించి కొత్త కమిషనర్ ను నియమించారు.అయితే దీనికి పూర్తిగా కేంద్రం సహకరించడం, ఏపీ బిజెపి నేతలకు మింగుడు పడడం లేదు.ఎందుకంటే ఏపీ ఎన్నికల కమిషనర్ ను తొలగించడం అంటే అది ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని కాదు, అది గవర్నర్ చేపట్టాల్సిన వ్యవహారం.రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్సును ప్రభుత్వం తీసుకు రావడం, దానికి వెంటనే గవర్నర్ ఆమోదం తెలపడం, కొత్త కమిషనర్ ను నియమించడం ఇలా అన్నిటిలోనూ వైసిపి ప్రభుత్వానికి కేంద్రం సహకరించడంతో నిమ్మగడ్డ రమేష్ తొలగించేందుకు సాధ్యమైంది.
ఈ విషయంలో కేంద్రం సహకారం పూర్తిగా ఉండడంతో ఏపీ బిజెపి నాయకులు దీనిపై పెద్దగా స్పందించ లేకపోతున్నారు.ఈ విషయం ఒక్కటే కాకుండా ప్రతి విషయంలోనూ ఏపీ బిజెపి నాయకులు అభాసుపాలు అవుతూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు.
ఇక వైసిపి కూడా ఏపీ బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.కేంద్ర బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడం, తమ నిర్ణయాలకు వారు మద్దతు తెలుపుతూ ఉండడంతో వైసిపి హవాకు తిరుగు లేకుండా పోతోంది.
ఈ విషయంలో అభాసు పాలు అవుతున్నది, నష్టపోతున్నది కేవలం బీజేపీ మాత్రమే.ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు ఇది చాలా ఇబ్బందికర పరిణామమే.