ఆమె భారత దేశానికి దక్కిన ఓ ఆణిముత్యం.ఆడదే అయినా సబల అని నిరూపినిచింది.
ఆమె మరెవ్వరోకాదు, వెన్నం జ్యోతి సురేఖ. ఓటమినుండి పాఠాన్ని నేర్చుకున్న ఓ నిరంతర యోధురాలు.గతంలో ఒకే ఒక్కసారి సెలెక్షన్ ట్రయల్స్లో తడబడినందుకు తొలి 2 ప్రపంచకప్ టోర్నీలలో భారత జట్టులో చోటు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ స్టార్ జ్యోతి సురేఖ మూడో ప్రపంచకప్ టోర్నీలో ఘనంగా పునరాగమనం చేసి, దుమ్ము దులిపింది.7 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బరిలోకి దిగి సత్తా చాటింది.
వివరాల్లోకి వెళితే, విజయవాడకు చెందిన సురేఖ పారిస్ వేదికగా జరుగుతోన్న ప్రపంచకప్ స్టేజ్–3 టోర్నీలో సత్తా చాటింది.కాంపౌండ్ కేటగిరీ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆర్చర్ అభిషేక్ వర్మతో కలిసి సురేఖ ఫైనల్లోకి వెళ్లడం ఓ అరుదైన అభినందనీయం ఘట్టమని చెప్పుకోవాలి.
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 156–151తో రాబిన్–లిసెల్ జాట్మా (ఎస్తోనియా) జోడీని ఓడించి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించింది.కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలోనూ సురేఖ అద్భుత ప్రదర్శన చేసి సెమీస్ చేరింది.
రెండో సీడ్గా బరిలోకి దిగిన సురేఖ తొలి రౌండ్లో 147–133తో యోహానా హోర్టా ఒలివియెరా (పోర్చుగల్)పై, రెండో రౌండ్లో 150–141తో ఎలీసా బజిచెటో (ఇటలీ)పై విజయకేతనం ఎగురవేసింది.
మూడో రౌండ్లో సురేఖ 146–144తో మార్సెలా (ఇటలీ)పై, క్వార్టర్ ఫైనల్లో 149–148తో లిసెల్ జాట్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది.2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో కాంపౌండ్ కేటగిరీని కూడా చేర్చాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రతిపాదన పంపించింది.మైదానంలో కాకుండా ఇండోర్ గ్రౌండ్లో కాంపౌండ్ పోటీలను నిర్వహించాలని కోరింది.
ప్రస్తుతం ఒలింపిక్స్లో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు.