ఏపీలో మూడు రాజధానులు అంశం చాలా కాలంగా పెద్ద చిక్కుముడిగా మారింది.దాదాపు అందరూ అమరావతి రాజధాని ఫిక్స్ అయ్యిపోయిన తరుణంలో, అకస్మాత్తుగా మూడు రాజధానులు అంటూ జగన్ ప్రకటన వెలువడగానే ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.
జగన్ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటున్నారని, కేవలం తెలుగుదేశం పార్టీపై ఉన్న కోపంతోనే అమరావతి నుంచి రాజధాని తరలింపు చేస్తున్నారని, ఇలా ఎన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి.మొదట్లో ఏపీ బీజేపీ నాయకులు సైతం ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తూ, పోరాటాలు చేశారు కానీ కేంద్రం మాత్రం ఈ విషయం సైలెంట్ అవడమే కాకుండా, పరోక్షంగా మద్దతు పలుకుతున్నట్లుగా వ్యవహరించింది.
ఇక రాజధానికి సంబంధించి కానీ, ఏ విషయంలోనైనా జగన్ కు బీజేపీ అన్ని రకాల సహాయ సహకారాలు అందించింది.ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో, ఈ విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.
మూడు రాజధానులు అంశం పై హైకోర్టు నోటీసులకు కేంద్రం స్పందించింది.ఈ మేరకు కేంద్ర హోంశాఖ సమర్పించిన అఫిడవిట్లో, మూడు రాజధానులు అంశానికి మద్దతు పలకడంతో పాటు, మూడు రాజధానులు పెట్టుకునేందుకు తగిన సహకారం అందిస్తామనే విధంగా అఫిడవిట్ దాఖలు చేసింది.
తాజాగా హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్ లో ‘ ఎ క్యాపిటల్ సిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ‘ అనే పదాలకు ఆంధ్ర ప్రదేశ్ కు కేవలం ఒక్క రాజధాని మాత్రమే ఉండాలి అని కాదని, అంతకు మించి అయినా ఉండొచ్చని పేర్కొంది.
మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మూడు రాజధానులు వ్యవహారంలో కేంద్రం జగన్ కు మద్దతు ఇస్తూనే వస్తుంది.రాజ్యాంగంలోని అధికరణ 214, ఏపీ విభజన చట్టంలోని 30, 31 సెక్షన్లలో నిబంధనలకు అనుగుణంగా, 2019 జనవరి 1 నుంచి హైకోర్టు ప్రిన్సిపల్ సీటుగా అమరావతిని ఖారారు చేస్తూ రాష్ట్రపతి 2018 డిసెంబర్ 26న ఆదేశాలు ఇచ్చారని, అంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధాని గా ప్రకటించినట్లుగా అనుకోవడానికి వీల్లేదు అని, అలాగే హైకోర్టు ప్రిన్సిపల్ సీటు తప్పనిసరిగా, రాష్ట్ర పరిధిలోనే ఉండాల్సిన అవసరం లేదని, పిటిషనర్లు వేసిన కౌంటర్ లో కేంద్రం పాత్రపై ప్రస్తావించిన అంశాలు సరికాదని వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టును కేంద్రం కోరింది.
మొదట్లో అమరావతికి అనుకూలంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడిన సుజనా చౌదరి వంటి వారిని సైలెన్స్ చేయడం, కన్నా లక్ష్మీనారాయణ ను తప్పించి సోము వీర్రాజు కి పార్టీ పగ్గాలు అప్పగించడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితం గా మూడు రాజధానులు నిర్ణయం జగన్ ది కాదని, బీజేపీ జగన్ ద్వారా ఇదంతా చేయిస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.