విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీలో ఆందోళనలు తీవ్రతరం అవుతున్న సంగతి తెలిసిందే.రాజ్యసభలో నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం పక్కా, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసిన తర్వాత ఒక్కసారిగా కార్మిక సంఘాలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపధ్యంలో ఏపీ ముఖ్యమంత్రి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవాలని, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ప్రధాని మోడీకి లేఖ రాశారు.అలాగే వైసీపీ పార్టీ నాయకులు మీడియా ముందుకి వచ్చి ప్రభుత్వం నుంచి కేంద్రంపై ఒత్తిడి తేస్తామనే విధంగా మాట్లాడారు.
అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అవ్వడం పక్కా అనే నిర్ణయానికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది.దీనిపై ఆర్ధిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ మరింత స్పష్టత ఇచ్చేశాడు.
దేశంలోనే 5 ఉక్కు పరిశ్రమలను ఐదేళ్లలో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు.ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసేస్తామని స్పష్టం చేశారు.
ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటెజిక్ పరిధిలోకి వస్తుందని, ఈ విభాగంలోకి వచ్చే అన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని చెప్పారు.ఆత్మ నిర్బర్ భరత్ లో భాగంగా ఈ ప్రైవేటీకరణ చేపడుతున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.ఏ ఒక్క ఉక్కు పరిశ్రమ ప్రైవేటైజేషన్ కి అతీతం కాదని, పక్కాగా జరిగి తీరుతుందని నొక్కి మరీ చెప్పారు.
దీనిని బట్టి ఏపీలో విశాఖ ఉక్కు కోసం ఎంత గొంతు చించుకున్న జరిగేంది ఏమీ లేదని అనురాగ్ ఠాగూర్ స్పష్టంగా తెలియజేసినట్లు అయ్యింది.