నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా నిఖిల్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.
అలాగే దర్శకుడు చందూ మొండేటికి కూడా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ ని నిఖిల్, చందూ మొండేటి ప్రకటించారు.
ఇక ఈ సినిమాకి సంబందించిన టైటిల్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.సుమారు 25 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు.
అయితే ఇంతలో కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.ఇప్పుడు లాక్ డౌన్ నుంచి షూటింగ్ కి సడలింపులు ఇచ్చినా నిఖిల్ గీతా ఆర్ట్స్ లో తెరకెక్కనున్న 18 పేజెస్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్నాడు.
అలాగే చందూ మొండేటి కూడా కార్తికేయ 2 పక్కన పెట్టి నివేదా పేతురాజ్ తో లేడీ ఒరియాంటెడ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు.
ఈ నేపధ్యంలో కార్తికేయ 2 గురించి వీరిద్దరి నుంచి ఎలాంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు.
బడ్జెట్ ఎక్కువ కావడం వలన ప్రస్తుతానికి ఈ సినిమాని హోల్డ్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తప్పుకుంది.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేకపోవడం ఒకటయితే, అలాగే ప్రస్తుతం ఈ భామ తమ మాతృభాషలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కార్తికేయ2 కోసం డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.అయితే అధికారికంగా దీనిపై చిత్ర నిర్మాతల నుంచి గాని, హీరోయిన్ అనుపమ నుంచి గాని ఎలాంటి క్లారిటీ లేదు.