భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది.ఊహించని విధంగా భారత ప్రజలు కరోనా రక్కసికి బలై పోతున్నారు.
అయితే భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చడానికి, ప్రధాన కారణం కరోనాను తక్కువగా అంచనా వేయడమేనని, కరోనా తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, కరోనా నియంత్రణ మండలి సభ్యుడు, అమెరికా అధ్యక్షుడుకి వైద్య సలహాదారుడు అయిన ఆంటోని ఫౌసీ అన్నారు.భారత్ అతివిశ్వాసమే ఇప్పుడు కొంప ముంచిందని అన్నారు ఫౌసి .
కరోనా కట్టడి విషయంలో ముందుగా ఓ విధానాన్ని భారత్ పాటించలేదని అందుకే సెకండ్ వేవ్ భారత్ లో ఈ స్థాయిలో పెరిగిపోవడానికి ప్రధాన కారణమని అన్నారు.కరోనా మొదటి వేవ్ ను సమర్ధవంతంగా నిర్మూలించామని ఇక కరోనా రాదనే టప్పుడు అభిప్రాయంతో అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చారని, కనీసం ముందస్తు జాగ్రత్తలు పాటించలేదని దాని ఫలితమే ఈ స్థాయిలో కరోనా పెరిగిపోవడానికి కారణమని అన్నారు.
భారత్ ప్రస్తుత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో జాగ్రత్తలు వహించాలని, లేకుంటే మునుముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చుకుని ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని అన్నారు.
ఏ దేశం ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఉన్నా అన్ని దేశాలు కలిసి సాయం అందించాల్సిన అవసరం ఉందని, తప్పకుండా భారత్ ఈ పరిస్థితుల నుంచీ బయటపడుతుందని అందుకు అమెరికా సహకారం పూర్తిగా ఉంటుదని తెలిపారు.