రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ తరపున గూఢచారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నూర్ ఇనాయత్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది.సెంట్రల్ లండన్లోని ఆమె నివాసం వద్ద నీలి స్మారక ఫలకాన్ని (బ్లూ ప్లేక్) ఏర్పాటు చేశారు.
ఈ గౌరవం పొందిన మొట్టమొదటి భారత సంతతి మహిళ నూర్ కావడం విశేషం.బ్రిటన్లోని ఇంగ్లీష్ హెరిటేజ్ ఛారిటీ సంస్థ ప్రముఖ వ్యక్తులను గుర్తించి వారితో అనుబంధం వున్న భవనాల్లో వారి పేరిట బ్లూ ఫ్లేక్ ఏర్పాటు చేస్తోంది.
మహాత్మా గాంధీ, అంబేద్కర్ లండన్ వచ్చినప్పుడు బస చేసిన ప్రాంతాల్లో ఇలాంటి స్మారకాలను ఏర్పాటు చేశారు.
అసలు ఎవరీ నూర్ ఇనాయత్ ఖాన్:
నూర్ తండ్రీ సూఫీ ముస్లిం, తల్లి అమెరికన్.మొదట వీరి కుటుంబం లండన్కు వెళ్లింది.అక్కడి నుంచి పారిస్ వెళ్లి స్థిరపడింది.నూర్ మాస్కోలో పుట్టారు.ఆమె విద్యాభ్యాసం పారిస్లోని సోర్బాన్లో జరిగింది.నూర్కు చాలా భాషలు తెలుసు.ఆ ప్రత్యేకతే ఆమెను బ్రిటిష్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్ఓఈ) ఆమె దగ్గరకే వచ్చేలా చేసింది.
ఎస్ఓఈ అంటే ఆక్రమిత ఫ్రాన్స్లో పనిచేసే అండర్ కవర్ ఏజెంట్లు.
నాజీలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తూ ఉండేవారు.అండర్ కవర్ ఏజెంట్గా నూర్ రేడియో ఆపరేటర్గా పనిచేసేవారు.లోకేషన్ మార్చుకుంటూ నాజీలకు దొరక్కుండా పనిచేసేవారు.ఎట్టకేలకు ఆమెను పట్టుకున్న నాజీలు 10 నెలల పాటు చిత్రహింసలు పెట్టి 13 సెప్టెంబర్ 1944న శిబిరంలో హత్య చేశారు.ఆమె త్యాగాన్ని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం 1949లో జార్జ్ క్రాస్ అవార్డును ప్రకటించింది.
అలాగే లండన్లో స్క్వేర్ గార్డెన్లో నూర్ ఖాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.