అస్సాంలోని జోర్హాట్ నుండి కోల్కతాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం టేకాఫ్ సమయంలో బుధవారం రన్వేపై సమస్యలు ఎదుర్కొంది.దాని టైర్లు బురదలో చిక్కుకపోవడంతో టేకాఫ్ సమయంలో సమస్య తలెత్తింది.
జులై 27న విమానం 98 మంది ప్రయాణికులతో టేకాఫ్ కోసం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుందని, విమానం రద్దు చేయబడిందని సంస్థ పేర్కొంది.ఇండిగో ఫ్లైట్ 6E-757 జోర్హాట్ నుండి కోల్కతాకు బయలుదేరే సమయంలో ఫ్లైట్ టైర్లు బురదలో చిక్కుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని వివరించింది.
పైలట్ ముందుజాగ్రత్తగా ఈ సమస్యను గమనించి, తనిఖీ చేయాలని గుర్తించాడు.విమానాన్ని తనిఖీ కోసం జోర్హాట్లోని బేకు తిరిగి తీసుకువెళ్లారు.
ప్రాథమిక తనిఖీ సమయంలో ఎటువంటి సమస్య తలెత్తలేదు.అయితే విమానాన్ని రద్దు చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది.
సాంకేతిక సమస్య కారణంగా జోర్హాట్లో చాలా గంటలు ఆగిన తర్వాత కోల్కతాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు చేయబడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి తెలిపారు.విమానంలో కొంత సాంకేతిక సమస్య ఉందని గుర్తించామన్నారు.
విమానంలో 98 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.ప్రయాణికులందరూ డీబోర్డ్లోకి దిగి సురక్షితంగా ఉన్నట్లు వివరించారు.
వారు టెర్మినల్ భవనంలో వేచి ఉండగా రాత్రి 8:15 గంటలకు విమానం రద్దు చేసినట్లు వెల్లడించారు.దీనిపై పలువురు నెటిజన్లు ట్విట్టర్ లో పోస్టులు చేశారు.
వాటికి ఇండిగో సంస్థ స్పందించింది.ప్రయాణికులను మరో విమానంలో సురక్షితంగా గమ్య స్థానాలకు పంపించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.పలు మార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో స్పైస్ జెట్ విమాన సంస్థపై డీజీసీఏ కన్నెర్ర చేసింది.48 విమానాల్లో 50 సార్లు పైగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.ఆ తర్వాత 50 శాతం ఫ్లైట్లను నడపాలని ఆదేశాలిచ్చింది.