అడవి ఒడిలో దశాబ్దాల క్రితం ఏర్పడిన ఈగ్రామం నేటికి గుక్కెడు నీళ్లకోసం యుద్ధం చేస్తూనే ఉంది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 8ఏళ్లు గడుస్తున్నా ఆ గ్రామంలోని తాగునీటి సమస్య మాత్రం తీరనే లేదు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానాలు తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలో ఒక్క మారు మూల గిరిజన గ్రామం లొద్దిగూడా గ్రామం.
సుమారు 55 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి.ధనిక రాష్ట్రంలో తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకొని బయటకు వెళ్లకూడదని చెప్పిన పాలకుల మాటలు క్షేత్రస్థాయిలో ఆచరణకు నోచుకోవడం లేదు.
మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా ఆఊరికి చుక్కనీరు రాలేదంటే అతిశయోక్తి కాదు.జిల్లాలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఇంతవరకు సగానికిపైగా గిరిజన గ్రామాలకు స్వచ్చమైన నీరు అంటే ఏమిటో తెలియని పరిస్థితి నెలకొంది.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఇంతకాలమైనా సాగునీటి సమస్య తీరడం లేదు.గిరిజన గ్రామాల్లో వేసవికాలంలో తడిఆరిన గొంతులకు గుక్కెడు త్రాగునీరు సైతం దొరకడం లేదని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమురం భీం జిల్లాలోని లింగాపూర్ మండల పరిధిలోగల లొద్దిగూడా గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు పైప్ లైన్ వేసిన అధికారులు స్వచ్ఛమైన నీటిని మాత్రం అందించలేక పోతున్నారు.కేవలం కాంట్రాక్టర్ల లాభం తదితర అంశాల కోసమే మిషన్ భగీరథ పనులు చేపట్టినట్లు తెలుస్తోంది.
లొద్దిగూడా గ్రామంలో తాగునీటి కోసం ఎలాంటి వనరులు లేకపోవడంతో గ్రామంలో ఉన్న పాడుబడ్డ బావిలో నుంచి గ్రామస్తులు మురికి నీరు తోడుకొని తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు.ఈగ్రామం లింగాపూర్ మండలం పరిధిలోకి వస్తున్నప్పటికీ ఈగ్రామానికి తాగునీరు సరఫరా తిర్యాని మండలం నుంచి జరగాల్సి ఉంది.
గుట్టల దిగువ భాగంలో ఈగ్రామం ఉంది.దశాబ్దాల కాలంగా ఈగ్రామస్తులు తాగునీటి కోసం వాగులు వంకలు ఫైనే ఆదార పడుతున్నారు.
కొమురం భీం జిల్లాలోని లింగాపూర్ మండల పరిధి గిరిజన గ్రామాల్లో బిందెడు తాగునీటి కోసం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది.ఎన్నికలకు ముందు మాత్రమే ఆ గ్రామాలకు వెళ్లి సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని నాయకుల హామీలే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు.ఆక్కడి గిరిజనులు ఓటు వేసే యంత్రాలుగా పాలకులు భావిస్తారనే వాస్తవం.తాగునీటి కోసం గిరిజనులు పడుతున్న ఫీట్లు చూస్తే అర్థమవుతుంది.ప్రాణాలకు తెగించి బిందెడు నీటి కోసం ఆదివాసీ గిరిజనులు ఎన్నో అవస్థలు పడుతున్నారు.ప్రమాదం అంచున నిలబడి నీళ్లు తోడుకుంటున్న దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించి పోతుంది.
ఈ గిరిజన గ్రామంలోని తాగునీటి సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు స్థానిక అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.తరతరాలుగా ఎదుర్కొంటున్న తమ తాగునీటి సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని లొద్దిగూడా గ్రామస్తులు కోరుతున్నారు.