దేశంలోని ప్రజలకు సరిగ్గా అర్ధం కానీ విషయం ఏంటంటే ప్రభుత్వాలు ఉచిత పధకాలంటూ ప్రకటిస్తే చంకలు ఎగరేసుకుంటూ వాటిని అందుకుని మురిసిపోతారు.కానీ ఆ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలను ఎంతలా ముంచుతుందో ఆలోచించరు.
ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పధకాల పేరుతో చేస్తున్న అప్పులు రోజు రోజుకు కుప్పలుగా పేరుకుంటున్నాయి.
పార్టీలు పదవిలో ఉండేది ఐదు సంవత్సరాలే.
కానీ ఈ అప్పులు చెల్లించే ప్రజలు మాత్రం తరతరాలుగా భరించవలసిందే.ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నది కేసీయార్ ప్రభుత్వం మాత్రమే అని అసెంబ్లీ వేదికగా ఒకింత గర్వంగానే ఈ పార్టీ నేతలు ప్రకటించారు.
కానీ మరో కోణాన్ని పరిశీలిస్తే వివిధ ఉత్పత్తి సంస్థల నుంచి జెన్కో కొనుగోలు చేసిన విద్యుత్కు చెల్లించే బకాయిలు మాత్రం ఏటేటా పెరిగిపోతున్నాయి.ఆ వివరాలు చూస్తే.2019 ఫిబ్రవరి నాటికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.4,196 కోట్లు ఉంటే, ఆ తర్వాతి సంవత్సరానికి రూ.6,323 కోట్లకు పెరిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది రూ.7,217 కోట్లకు పెరిగింది.విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత 45 రోజుల గడువు లోపు చెల్లింపు చేయాలన్నది నిబంధన.
ఒకవేళ చెల్లించకపోతే దాన్ని ‘ఓవర్ డ్యూ’గా పేర్కొనాల్సి ఉంటుంది.ఇలా తెలంగాణ జెన్కో విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో చెల్లింపులు చేయకపోవడంతో ‘ఓవర్ డ్యూ’ పేరుతో బకాయిలు పేరుకు పోతున్నాయి.
మరోవైపు కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ డిస్కంలు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నాయంటూ మొత్తుకుంటోంది.ఇకపోతే ఈ భారాన్ని విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల మీద వేస్తే వ్యతిరేకత వస్తుందనే భయం వల్ల గొప్పలు చెప్పుకుంటూ అధికారాన్ని అనుభవిస్తున్నారు నేతలు.
ఇలాంటి దిమ్మ తిరిగే భాగోతాలు ఇంకా ఎన్నో జరుగుతున్నాయి.కానీ ప్రజలకు కావలసింది ఉచితం.అంతవరకు రాతలు మారవు.