వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి జగన్ కు ఏపీలో అఖండ విజయాన్ని సాధించిపెట్టిన ప్రశాంత్ కిషోర్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోనే ఉంది.ఆయన ఏ పార్టీకి వ్యూహరచన చేసినా, ఆ పార్టీ తప్పకుండా ఎన్నికల్లో గెలవడం ఆనవాయితీగా వస్తూ ఉండడం తో, దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగుతోంది .
ఆయన ను తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకుని ఎన్నికల్లో గట్టెక్కాలని ప్రతి పార్టీ ప్రయత్నిస్తూనే వస్తోంది.ఏపీలో వైసీపీ తరువాత ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వంటి ఎంతో మందికి పీకే వ్యూహాలు సక్సెస్ తెచ్చిపెట్టాయి.
తమిళనాడు లో స్టాలిన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ విజయంలోనూ పీకే రాజకీయ వ్యూహాలు బాగా పని చేశాయి.పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ పోరు ఉండడంతో పీకే వ్యూహాలు పనిచేయవని చాలా మంది ముందుగా భావించినా, బీజేపీకి 100 కంటే తక్కువ స్థానాలు వస్తాయి అని, అలా రాకపోతే సోషల్ మీడియాను సైతం తాను వదిలేస్తాను అంటూ పీకే సవాల్ చేశారు.
అలా చెప్పినట్లుగానే బిజెపికి వందకు తక్కువ కాకుండా స్థానాలు దక్కాయి.అలాగే మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చింది.
దీంతో మరోసారి దేశవ్యాప్తంగా పీకే పేరు మార్మోగుతోంది.అయితే ఆయన మాత్రం అనూహ్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై తాను ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయబోనని ప్రశాంత్ కిషోర్ ప్రకటించేశారు. అయితే ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన తన సొంత రాష్ట్రమైన బీహార్ లో త్వరలోనే ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఆయన సేవలను మరోసారి ఏపీలో ఉపయోగించుకోవాలని చూస్తున్న జగన్ కు ఈ నిర్ణయం పెద్ద ఇబ్బందికరంగానే మారేలా కనిపిస్తోంది.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న, వాటిపై ప్రతిపక్షాలు నానా రాద్దాంతం చేస్తూ, ఆ పథకాల విషయంలో ప్రభుత్వానికి క్రెడిట్ రాకుండా చేస్తున్నటువంటి వ్యవహారాలపై జగన్ చాలాకాలంగా అసంతృప్తితో ఉన్నారు .
అయితే ఏపీ లో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకి విజయం దక్కుతున్నా, ప్రతిపక్షాలు బలహీనం కాకపోవడం జగన్ కు రుచించడం లేదు.అందుకే మరోసారి పీకే సేవలను ఉపయోగించుకోవాలని ఆయన చూస్తున్న తరుణంలోనే అకస్మాత్తుగా ప్రశాంత్ కిషోర్ ఈ నిర్ణయం తీసుకోవడం జగన్ తో పాటు చాలా మందికి నిరాశ కలిగిస్తోందట.