ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి లావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.2021-23 కాలానికి ఆయన తానా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.కృష్ణా జిల్లా పెద్దఅవుటుపల్లి గ్రామంలో 1971 మార్చి 27న అంజయ్య చౌదరి జన్మించారు.తల్లిదండ్రులు లావు సాంబశివరావు- శివరాణి.తండ్రి విశాఖపట్నంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగి కావడంతో అంజయ్య చౌదరి.బాబాయి లావు రంగారావు, పిన్నమ్మ కోటేశ్వరమ్మల సంరక్షణలో పెరిగారు.గన్నవరంలోని సెయింట్ జాన్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, విజయవాడలోని గౌతమి రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో బీటెక్, ఎంటెక్ గుల్బర్గాలో పూర్తి చేశారు.1988లో అమెరికా వెళ్లిన అంజయ్య చౌదరి అట్లాంటాలో స్థిరపడ్డారు.1997లో విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన నతాషాతో ఆయన వివాహం జరిగింది.ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం.
అక్కడ ఉద్యోగం చేస్తూ తెలుగు వారి సంక్షేమం కోసం పాటుపడుతున్న తానాలో అంజయ్య చౌదరి సభ్యులుగా చేరారు.అప్పటి నుంచి స్థానిక తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
అమెరికాలో ఉద్యోగం, విద్య కోసం వచ్చి వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలను భారత్కు తరలించడానికి అంజయ్య తనవంతు కృషి చేస్తున్నారు.అలాగే అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, ఫేస్బుక్ సమాచారం ఆధారంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయపడేవారు అంజయ్య చౌదరి.
ఇక తన స్వగ్రామం పెద్ద అవుటుపల్లి గ్రామంలోనూ అంజయ్య చౌదరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.విజయవాడ మణిపాల్ హాస్పిటల్ సహకారంతో హృద్రోగ వైద్య శిబిరం ఏర్పాటు చేసి, గుండె వ్యాధులు ఉన్న వారికి ఆపరేషన్లు చేయించారు.
అలాగే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యుల సహకారంతో క్యాన్సర్ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నారు.దీనితో పాటే జైపూర్ నుంచి కృత్రిమ అవయవాలను తెప్పించి వికలాంగులకు పంపిణీ చేశారు అంజయ్య చౌదరి.2011 నుంచి 2013 వరకు తానా టీమ్ స్క్వేర్ ఛైర్మన్గా పనిచేసిన అంజయ్య చౌదరి తదనంతరం ఎన్నో పదవులు చేపట్టారు.2019 నుంచి 2021 వరకు తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తించారు.
తానా ఆవిర్భావం:
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం ఎక్కువైంది.అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగువారు వున్నారు.ఇక వారి వారి పిల్లలతో మన తెలుగు సంతతి బాగా పెరిగిపోయింది.అలా అక్కడున్న వారికి ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడంతో పాటు తెలుగు వారిలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి పుట్టిందే “తానా” సంస్థ.
డాక్టర్ గుత్తికొండ రవీంద్రనాథ్ 1977లో తానాకు అంకురార్పణ చేశారు.ప్రస్తుతం 49 వేల సభ్యులు, 2 వేల మంది వాలంటీర్లతో ఈ సంస్థ మహా వృక్షంగా ఎదిగింది.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోనూ ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టింది తానా.