ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మంది వారి పక్కన వారితో కంటే ఫోనుల్లోనే అధిక సమయం గడిపేస్తున్నారు.చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా ఇదే పని.
అందులోనూ కొంతమంది యువత మరీ ఎక్కువగా ఫోనుల్లోనే మునిగి తేలుతుంటారు.టెక్నాలజీని వాడటం తప్పు కాదు, కాని ఇంట్లో వారిని, తోటి వారిని పట్టించుకోలేనంతగా దానికి బానిసలుగా మారుతున్నారు.
అయితే కొంత మంది యువత మాత్రం అదే టెక్నాలజీతో ఎన్నో రకాలైన మంచి పనులు చేస్తున్నారు.వారికి తోచిన విధంగా సామాజిక బాధ్యతను తీసుకుంటున్నారు.ఈ కోవకు చెందిన అమ్మాయే ఇండో అమెరికన్ అనిక కుమార్.
19 ఏళ్ళ ఈ ఇండో అమెరికన్ అనిక కుమార్, తన సహచర హై స్కూల్ విధరదులతో కలసి ఒక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.సాధారణంగా ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ళు ఎప్పుడు అందరితో మాట్లాడుతూ, పిల్లలకు వారి అనుభవాలను చెబుతూ, మంచి, చెడులు హెచ్చరిస్తూ ఉంటారు.కానీ ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఒంటరిగా ఎవరు మాట్లాడడానికి తోడు లేక ఎంతో ఒంటరితనానికి గురవుతున్నారు.
అలంటి సీనియర్ సిటిజెన్స్ కోసం ఈ అమ్మాయి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.అదే.“ఫర్ గెట్ మి నాట్” అనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది…ఈ ప్రోగ్రాం ద్వార అమెరికాలోని సాన్-జోస్ లో కొంతమంది సభ్యులు ఒంటరి సీనియర్ సిటిజెన్స్ కి ఫోన్ చేసి మాట్లాడతారు.
ఆ ఫోను సంభాషణల్లో వారి, సంతోషం, బాధ, అనుభవాలు, వారి అభిరుచులు అన్ని పంచుకుంటారు.దీని వలన పెద్ద వాళ్ళు వాళ్ళల్లో ఉన్న ఒంటరి బాధను తగ్గించుకోగలుగుతున్నారు.అయితే దీని కోసం సీనియర్ సిటిజెన్స్ ముందుగా “ఫర్ గెట్ మి నాట్” లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
ఆ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ సంస్థకు చెందిన వాలంటీర్స్ వారితో సంభాషణ జరుపుతారు.ఈ సంస్థ తమ వాలంటీర్స్ ను హై స్కూల్ చదువుతున్నా వారిని (15-16 ఏళ్ళు) తీసుకుంటూ, గతంలో మాట్లాడిన ఫోన్ కాల్స్ ను వినిపించి శిక్షణ ఇస్తుంది.
ఈ ఫోన్ కాల్స్ వీరు వారానికి ఒకసారి 20 నుంచి 30 నిముషాలు మాట్లాడతారు, ఒక్కోసారి వారి సంభాషణ బట్టీ 30 నుంచి 40 కూడా మాట్లాడతారు.