విశాఖను ఏపీ రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి విశాఖ లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ నిర్ణయం పై స్పందన ఓ రేంజ్ లో వస్తోంది. నిన్న విశాఖలో జగన్ పర్యటించిన సందర్భంగా ఈ విషయం బాగా అర్థమైంది. ఆయనకు జనాలు అడుగడుగునా నీరాజనాలు పలకడంతో ఈ అంశం మరోసారి హైలెట్ అయ్యింది. అయితే జగన్ నిర్ణయం ప్రకటించినా దీనిపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన అధికారికంగా రాలేదు. మరి కొద్ది రోజుల పాటు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ కేబినెట్ భేటీ సందర్భంగా జగన్ ప్రకటించారు. కాకపోతే రాజధాని తరలింపు సంబంధించిన పనులు శరవేగంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ విభాగానికి సంబంధించి బిల్డింగ్ కోసం ప్రభుత్వ అధికారులు విశాఖలో వెతుకులాట మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే ఆంధ్ర యూనివర్సిటీ లోని కొన్ని బ్లాకులను సెక్రటరియేట్ కేటాయిస్తే బాగుంటుందని ఆలోచన అధికారులు వచ్చారు. జాతీయ రహదారిపై ఈ యూనివర్సిటీలో చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉండడంతో పాటు సుమారు 1500 మందికి సరిపడా అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ కూడా ఉండడం, పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఇక్కడ అయితేనే బాగుంటుందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. దీనివల్ల విద్యార్థులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని, పైగా జాతీయ రహదారి దగ్గరగా ఉండడం, ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు కూడా సులువైన మార్గంగా ఉండడంతో ఇక్కడే సెక్రటేరియట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.