దేశంలో ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.కరోనా ఆరంభంలో ఉన్నప్పుడు కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతున్న దశలో ఉన్నపళంగా సడలింపులు ఇవ్వడంతో మొత్తం వ్యవస్థలు అన్ని సాధారణ స్థితికి వచ్చేస్తున్నాయి.
అయితే ఈ పరిస్థితి ప్రజలకి కొంత వెసులుబాటులా ఉన్నా కూడా కరోనా కేసులు పెరుగుతున్న దశలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అది ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది.ఇక ఏపీలో కూడా ప్రతి రోజు తక్కువగా 50 కేసుల వరకు నమోదు అవుతున్నాయి.
అయితే ఇక్కడ లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో అన్ని సాధారణ స్థితికి వచ్చేశాయి.కేవలం రెడ్ జోన్స్ లలో మాత్రమె లాక్ డౌన్ ఉంది.
రాష్ట్రంలోని దాదాపు 6,592 పరిశ్రమల యూనిట్లలో పనులు ప్రారంభం కాగా, వీటి నుంచి ఉపాధి పొందుతున్న 70 వేల మంది తిరిగి విధుల్లోకి వెళ్లారు.ఇప్పటికే ప్రజా రవాణాను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతానికి కొన్ని బస్సులనే నడిపిస్తున్నప్పటికీ, వాటి సంఖ్యను దశలవారీగా పూర్వపు స్థితికి తీసుకురానుంది.
పనులు ప్రారంభించిన సంస్థల్లో 20 శాతం మంది పని చేస్తుండగా, పరిశ్రమల రీస్టార్ట్ విషయంలో ప్రకాశం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలు ముందున్నాయి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దీపన చర్యలతో ఇవన్నీ లబ్ది పొందనున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై వాహనాల సందడి తిరిగి ప్రారంభమైంది.జ్యూయెలరీ షాపులు, సెలూన్లు, వస్త్ర దుకాణాలు, సిమెంట్, బుక్స్ అండ్ స్టేషనరీ, బేకరీ, గృహోపకరణాల దుకాణాలు తెరచుకోగా, వాహనాల సర్వీసింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
దీంతో ఏపీ అంతా దాదాపుగా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నట్లయింది.అయితే కరోనా కట్టడి చేయడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తీసుకుంటున్నారు.