అవకాశాలు తన్నుకుపోతున్నారనో, తమ కంటే తెలివైనవాళ్లేమోనన్న అనుమానమో కానీ అమెరికన్లు భారతీయుల పట్ల ద్వేషం ప్రదర్శిస్తున్నారు.ఈ క్రమంలో భౌతికదాడులతో పాటు ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడటం లేదు.
తాజాగా వీరి జాత్యహంకారానికి బాధితురాలిగా మారింది భారత్లోని సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుటుంబం.ఆయన కుమార్తె అనన్య బిర్లా శనివారం తన తల్లి నీరజా బిర్లా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్- అమెరికన్ రెస్టారెంటుకు వెళ్లారు.
ఈ క్రమంలో భోజనం ఆర్డర్ చేసిన తమను, గంటల కొద్దీ వెయిట్ చేయించారని, కస్టమర్లన్న కనీస మర్యాద లేకుండా అనుచితంగా ప్రవర్తించారని అనన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కోపా రెస్టారెంట్ నిర్వాహకులు నన్ను, నా కుటుంబాన్ని బయటకు గెంటేశారు.
జాతి వివక్ష ప్రదర్శించారు.ఇది నిజంగా విషాదకరం.
కస్టమర్ల పట్ల ఇలాంటి వైఖరి సరైంది కాదు.మీ రెస్టారెంటులో భోజనం చేయడానికి మేం మూడు గంటలు ఎదురుచూశాం.
కానీ, మీ వెయిటర్ జోషువా సిల్వర్మాన్ మా అమ్మతో అత్యంత దురుసుగా ప్రవర్తించారు.జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు.
ఇది అస్సలు సరైంది కాదు.వెరీ రేసిస్ట్’’ అంటూ చెఫ్ ఆంటోనియా లొఫాసో నేతృత్వంలోని ఇటాలియన్ మూలాలున్న సదరు రెస్టారెంటు నిర్వాహకుల తీరును నెటిజన్ల దృష్టికి తీసుకువచ్చారు అనన్య.
అనన్య తల్లి, విద్యావేత్త నీరజా బిర్లా కూడా రెస్టారెంట్ నిర్వాహకులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.కస్టమర్లతో ఇలా వ్యవహరించే హక్కు మీకు లేదు “అని ట్వీట్ చేశారు.అనన్య సోదరుడు ఆర్యమన్ బిర్లా కూడా ఈ విషయంపై స్పందించాడు.గతంలో ఎన్నడూ తమకు ఇలాంటి రేసిస్ట్ అనుభవాలు ఎదురుకాలేదని, జాతి వివక్ష ఉందన్న విషయాన్ని ఇంకా నమ్మలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్, బిలియనీర్ కుమార్ మంగళం బిర్లా కూతురైన అనన్య బిర్లా గాయనిగా, ఆర్టిస్టుగా తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే.