ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.ఇప్పటి వరకు వైసీపీ లోకి వచ్చేందుకు టీడీపీ ఎమ్యెల్యేలు, నాయకులూ ప్రయత్నిస్తున్నారు.
అలాగే మరికొంతమంది బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఇప్పుడు ఓ వైసీపీ ఎమ్యెల్యే బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం సంచలనం రేకెత్తిస్తోంది.
నెల్లూరు జిల్లాకు చెందిన ఆ సీనియర్ నాయకుడు కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన సొంత పార్టీ నాయకుల మీదే విమర్శలు చేస్తున్నారు.దీనిపై పార్టీ అధిష్టానం హెచ్చరికలు చేసినా ఆయన పూర్తిస్థాయిలో కంట్రోల్ అవ్వడంలేదు.
ఇప్పుడు వైసీపీలో ఈయన గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఆయనే మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి.
బీజేపీలో చేరేందుకు ఆయన పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.సొంత పార్టీలో ఇమడలేకపోతున్న ఆనంకు బీజేపీ నుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.
అందుకే ఆయన వైకిరిలో మార్పు వచ్చినట్టుగా సమాచారం.
ఆనం బీజేపీలో చేరితే ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన శాఖలు నిర్వహించిన ఆనం, ఆ తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా కీలకంగా వ్యవహారాలు నడిపారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న దశాబ్ధ కాలంలో రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన ఆనంకు ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేద్దామని చూసింది.
అయితే విభజన అనంతరం కాంగ్రెస్ కనుమరుగు కావడం, ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు తారుమారు అవ్వడంతో ఆనం టిడిపిలో చేరాల్సి వచ్చింది.ఆత్మకూరు నియోజకవర్గానికి ఇన్చార్జ్గా వ్యవహరించే సమయంలో స్థానికంగా ఉన్న నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనకు ఇవ్వడం లేదనే ఆగ్రహంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.
వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన ఆనంకు మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించగా జగన్ ఆయన్ను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆనం అసంతృప్తికి గురయ్యారు.
అయితే నెల్లూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కు జగన్ తన కేబినెట్లో స్థానం కల్పించారు.ఇక అప్పటి నుంచి కొంత అసంతృప్తిగా ఉన్న ఆనంకు ఇటీవల నెల్లూరు లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.దశాబ్ధాల కాలంగా వారి ఆధీనంలో ఉన్న నెల్లూరు వీఆర్సీ విద్యాసంస్థలు, వేణుగోపాల స్వామి డిగ్రీ కాలేజ్, వేణుగోపాల స్వామి ఆలయాలకు సంబంధించిన భూముల వ్యవహారంపై జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు విచారించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు రికార్డులు బయటకి తీయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.అలాగే వీఆర్సీ విద్యాసంస్థల సెక్రటరీ బాధ్యతల నుంచి ఆనం కుటుంబీకులను తొలగించి జిల్లా జాయింట్ కలెక్టర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆనం మరింతగా రగిలిపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ వైపు చూస్తున్నట్టుగా సమాచారం.అదే కనుక జరిగితే వైసీపీలో కలకలం రేగడం మాత్రం ఖాయం.