ఏపీలో టీడీపీ పరిస్థితి మెరుగవుతుంది అనుకుంటున్న సమయంలో పార్టీకి చెందిన కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే ఎమ్యెల్యే మేడా మల్లికార్జున రెడ్డి పార్టీని వీడగా ప్రకాశం జిల్లాకు చెందిన ఆమంచి కృష్ణ మోహన్ కూడా రేపో మాపో అన్నట్టుగా పార్టీని వీడేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక ప్రతి జిల్లాలోనూ….ఒకరిద్దరు కీలక నాయకులు పార్టీని వీడేందుకు అసంతృప్తిగళం వినిపిస్తున్నారు.
ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు నెల్లూరు రూరల్ లో పార్టీ కీలకనేత ఆనం జయకుమార్ రెడ్డి.
అసలు ఈయన అసంతృప్తికి కారణం ఏంటి అంటే…? రూరల్ టీడీపీ టిక్కెట్ తనకు ఇస్తానని ఇంతకాలం చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూరల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తన భుజస్కంధాలపై పెట్టి ఇప్పుడు తన భుజంపైనే తుపాకీ పెట్టి తనను కాల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.గత ఆరు నెలలుగా రూరల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్, ప్రతి గ్రామం తిరిగి పార్టీని పటిష్టం చేశానన్నారు.
ఆ విశ్వాసం కృతజ్ఞత కూడా లేకుండా నిర్ధాక్షిణ్యంగా తనను అవమానించారని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆయన అవసరం అయితే టీడీపీని వీడేందుకు కూడా సిద్ధం అంటూ… సంకేతాలు పంపుతున్నారు.