ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీని వీడే నాయకుల సంఖ్య రోజు రోజుకి పెరిగే అవకాశం వుందని టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.అందుకు తగ్గట్లుగానే నిన్న ఆమంచి కృష్ణ మోహన్, ఈ రోజు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరారు.
ఇంకా వైసీపీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి చెబుతున్న దానిని బట్టి మరో 20 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీని వీడి వైసీపీలోకి రావడానికి సిద్ధంగా వున్నారని తెలుస్తుంది.ఇదిలా వుంటే రాజీనామా చేసిన అనంతరం పార్టీ నాయకులు అందరూ నేరుగా చంద్రబాబుని టార్గెట్ చేయడం ఇప్పుడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా రాజీనామా చేసి వైసీపీలో చేరిన తర్వాత అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసారు.చంద్రబాబు సీనియర్ లీడర్ అని అప్పుడు అతనికి మద్దతుగా పార్టీలో చేరితే, ఆయన మాత్రం బంధుప్రీతీ, సన్నిహితులని కాపాడటంలోనే తన అధికారాన్ని ఉపయోగించుకున్నారని, ఏపీలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అవినీతి గురించి ప్రధానికి ఫిర్యాదు వెళ్ళిన తర్వాతనే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగిపోయాయని, చంద్రబాబు ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తూ, తన మాటలే ప్రజలు విస్వసించాలి అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయిస్తున్నారని, తాను ఏది చేసిన ప్రజలు నమ్మాలి అనే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ మరల మోడీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని అవంతి విమర్శలు చేసారు.
టీడీపీ పరిపాలన ఎలా సాగిందో ప్రజలందరూ దగ్గరుండి చూసారని, దాని రిజల్ట్ ఎలా ఉండబోతుందో త్వరలో జరిగే ఎన్నికలలో చూపిస్తారని అవంతి ఆరోపణలు చేసారు.మరి అవంతి ఆరోపణలపై తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఎ విధంగా స్పందిస్తాయి అనేది వేచి చూడాలి.