సొంత ఇంటిని కొనుగోలు చేయాలని అందరికీ ఉంటుంది.అందులోనూ విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేయాలంటే అందరికీ సాధ్యపడదు.
అయితే కోట్ల విలువైన ఇంటిని అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం వస్తే ఏం చేస్తారు.ఖచ్చితంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు.
ఈ బంపరాఫర్ ఎక్కడ అందుబాటులో ఉందని తెలుసుకోవాలనుకుంటున్నారా.ఇది మీ కోసమే.4,00,000 బ్రిటన్ పౌండ్ల (రూ.3.7 కోట్లు) విలువైన నాలుగు పడకగదుల ఇల్లు ప్రస్తుతం విక్రయానికి సిద్ధంగా ఉంది.అందుకు మీరు చెల్లించాల్సింది కేవలం 3 బ్రిటన్ పౌండ్లు (రూ.277) మాత్రమే.లాటరీ టికెట్ కొనడం ద్వారా మీరు ఈ ఇల్లు సొంతం చేసుకోవచ్చు.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
డానియల్ ట్వెనెఫోర్, సోదరులు జాసన్, విల్లతో కలిసి కెంట్లోని మెడ్వేలో ఉన్న విలాసవంతమైన, అత్యాధునిక ఇంటిని అమ్మకానికి పెట్టారు.దీనిని తక్కువ ధరకే లాటరీ ద్వారా విజేతకు అందజేయనున్నారు.3 పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.277కే లాటరీ టికెట్ కొనుగోలు చేసి, ఆ ఇంటిని సొంతం చేసుకోవచ్చు.ఆ ఇల్లు రైల్వే స్టేషన్కు సమీపంలో ఉంది.
విలాసవంతమైన మూడు అంతస్తుల ఇంట్లో నాలుగు పెద్ద బెడ్రూమ్లు, విశాలమైన ఈట్-ఇన్ కిచెన్, లివింగ్ రూమ్, గార్డెన్ ఉన్నాయి.ట్వెన్ఫోర్ సోదరులు ఇప్పటి వరకు ఇలా 9 ఇళ్లు అమ్మారు.ఇంతకుముందు 500,000 పౌండ్లు (రూ.4.6 కోట్లు) విలువైన మూడు అపార్ట్మెంట్లను ఒకేసారి ఇలా విక్రయించారు.లాటరీ విజేత తమకు దక్కిన ఇంటిని ఏమైనా మార్పులు చేసుకోవచ్చు.
వారు దానిని అద్దెకు కూడా తీసుకోవచ్చు.ఈ ప్రాంతంలో అటువంటి ఇంటికి నెలకు అద్దె రూపంలో 2,000 పౌండ్లు (రూ.1.85 లక్షలు) ఆదాయం వస్తుంది.ఇదిలా ఉండగా స్టాంప్ డ్యూటీ, లీగల్ ఫీజులు వంటి బదిలీ ఖర్చుల కోసం ట్వెన్ఫోర్ సోదరులు ఇంకా 1,55,000 లాటరీ టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది.అయితే అన్ని టిక్కెట్లు విక్రయించబడకపోతే, విజేతకు టికెట్ రశీదులలో 70 శాతం అందించబడుతుంది.
ట్రామ్వే పాత్ పేరుతో సోదరులు తమ వ్యాపారం కింద ఆస్తులను ఇలా లాటరీలో పెట్టారు.