భారత్లో కోవిషీల్డ్ వేసుకున్న వారిని తమ దేశంలో టీకాలు వేసుకోని వారిగానే పరిగణిస్తామని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించడంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే.కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తమ దేశంలో 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి.
భారత్ ఒత్తిడితో చివరకు దిగివచ్చిన బ్రిటన్ ప్రభుత్వం.అంతర్జాతీయ పర్యాటక అడ్వైజరీ జాబితాలో కొవిషీల్డ్ను చేర్చుతున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా స్పందించారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదించిన వ్యాక్సిన్ను ధ్రువీకరించేందుకు అన్ని దేశాలు ఓ వేదికను రూపొందించుకోవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దీనిపై అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని పూనావాలా సూచించారు.
అటు వ్యాక్సిన్ ఎగుమతులపైనా స్పందించారు అదర్ పూనావాలా.
కొవాక్స్ కార్యక్రమం ద్వారా కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఎగుమతిని అక్టోబర్ నెలలో తిరిగి ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.జనవరి నాటికి వ్యాక్సిన్ ఎగుమతిని క్రమంగా పెంచుతామని చెప్పారు.
ప్రస్తుతం భారతదేశంలో వ్యాక్సినేషన్కు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో కొవిడ్ టీకాలకు డిమాండ్ అధికంగా వుందని పూనావాలా చెప్పారు.దేశీయ అవసరాలను దృష్టిలో వుంచుకుని గడిచిన ఆరు నెలలుగా వ్యాక్సిన్ ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుతం కొవిషీల్డ్ ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మరోసారి వీటిని ఎగుమతి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.సీరం ఇన్స్టిట్యూట్ ప్రతినెలా దాదాపు 20 కోట్లకుపైగా కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.
కాగా, కోవిషీల్డ్ వ్యవహారంలో తమను తీవ్రంగా ఇబ్బండి పెట్టిన బ్రిటన్కు భారత్ గట్టి షాకిచ్చింది.భారత్లో అడుగుపెట్టిన బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్లో ఉంచడంతోపాటు 3 సార్లు కొవిడ్ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయనుంది.దీని ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 ఆర్టీ పీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.
భారత్కు చేరుకున్న తర్వాత ఇంటివద్ద/ హోటల్లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలి.వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.