అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.వేలాది మంది మృతి చెందగా లక్షల సంఖ్యలో ప్రజలు కరోన బారినపడుతున్నారు.
ఈ పరిస్థితులలో ఎంతో మంది అమెరికా ప్రజలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులుపడుతున్నారు.అమెరికాలో ఉన్న వలస వాసులని వారి వారి దేశాలకి పంపడానికి ఇప్పటికే ట్రంప్ చర్యలు మొదలు పెట్టేశారు.
కేవలం కొన్ని రోజుల వ్యవధిలో ఈ చర్యలు అమలు కానున్నాయి.అయితే విదేశాలలో ఉంటున్న అమెరికన్స్ అందరూ వచ్చేయండి అంటూ ట్రంప్ ఇటీవల కాలంలో పిలుపు ఇచ్చిన విషయం విధితమే.కానీ
ట్రంప్ ఆహ్వానాన్ని అమెరికన్స్ అందరూ తిరస్కరిస్తున్నారు.ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కరోనా మహమ్మారి అమెరికా పై తీవ్ర ప్రతాపం చూపుతోంది.ఈ క్రమంలో అక్కడికి వెళ్తే తమ ప్రాణాలు కూడా గాలిలో కలిసి పోతాయని భయపడిన అమెరికన్స్ చాలామంది అమెరికా ఇప్పట్లో రాలేమని తేల్చి చెప్తున్నారు.ముఖ్యంగా భారత్ లో ఉంటున్న అమెరికన్స్ ఇక్కడ కరోనా ప్రభావం ఎక్కువగా లేదు కాబట్టి ఇప్పట్లో రాలేమని చెప్పారట.
అమెరికన్స్ ని తీసుకువెళ్ళడానికి ప్రత్యేకమైన విమానాలు భారత్ పంపగా అందులో కేవలం 4 వేల మంది మాత్రమే వెళ్ళారని రెండవ ట్రిప్ లో కనీసం సీట్లు కూడా భర్తీ కాలేదని భారత్ తో ఉంటున్న అమెరికా దౌత్యవేత్త బ్రౌన్ లీ తెలిపారు.భారత్ లో ఉంటున్న సుమారు 6 వేల మంది అమెరికన్స్ అమెరికా వెళ్ళడానికి సిద్దంగా లేరని భారత్ లోనే తమకి బాగుందని అమెరికాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత మాత్రమే వస్తామని తెలిపారని బ్రౌన్ లీ వెల్లడించారు.