కరోనా భయంతో జపాన్ తీరంలో చిక్కుకుపోయిన భారీ విలాస నౌక డైమండ్ ప్రిన్సెస్ నుంచి కరోనా వైరస్ సోకిన తమ వారిని అమెరికా ఎట్టకేలకు రక్షించుకుంది.సోమవారం తెల్లవారుజామున రెండు విమానాల్లో అమెరికా పౌరులను ఆ దేశ అధికారులు తీసుకెళ్లారు.
ఇవి టోక్యో విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు జపాన్ మీడియా వర్గాలు తెలిపాయి.ఈ నౌకలో మొత్తం 400 మంది అమెరికన్లు చిక్కుకుపోయారు.
చైనాలో కరోనా వైరస్ జాడలు బయటపడటం, వేగంగా విస్తరిస్తూ ఉండటంతో పాటు ఈ నౌకలో ప్రయాణించి హాంకాంగ్లో దిగిన ఓ వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది.దీంతో డైమండ్ ప్రిన్సెస్ నౌకను ఫిబ్రవరి 3 నుంచి జపాన్ తీరప్రాంతంలోనే నిలిపివేశారు.
ఇందులో వివిధ దేశాలకు చెందిన సుమారు 3,700 మంది ప్రయాణికులు ఉన్నారు.వీరిలో 40 మంది అమెరికన్లకు కరోనా వైరస్ సోకడంతో చికిత్స అందిస్తూ వచ్చారు.కాగా టోక్యో నుంచి బయల్దేరిన రెండు ప్రత్యేక విమానాల్లో ఎంతమంది అమెరికన్లు ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు.
ప్రయాణ సమయంలో ఎవరికైనా కొత్తగా వైరస్ సోకినట్లు గుర్తిస్తే వారిని విమానాల్లోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఉంచుతామని అధికారులు తెలిపారు.అమెరికా చేరుకున్న తరర్వాత వారిని 14 రోజుల ప్రత్యేక పరిశీలన అనంతరం ఇళ్లకు పంపుతారు.ఇదే సమయంలో నౌకలో ఉన్న కొంతమంది ఆరోగ్యంగా ఉన్న అమెరికన్లు.
వైరస్ సోకిన వారితో కలిసి ప్రయాణించేందుకు నిరాకరించినట్లుగా తెలుస్తోంది.టెస్ట్ కిట్లు, ఇతర సామాగ్రి, మానవ వనరుల లభ్యత లేని కారణంగా డైమండ్ ప్రిన్సెస్ ఓడలో ఉన్న వారందరికీ జపాన్ ప్రభుత్వం చికిత్స అందించలేకపోయింది.
మరోవైపు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 1,770కి చేరుకుంది.ఆదివారం ఒక్కరోజే 105 మరణాలు సంభవించగా, కొత్తగా రెండువేల మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది.